బలంగా ఢీకొని అల్జీరియా విమానం ముక్కలు ముక్కలు!
అల్జీర్స్: అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ప్రమాదం బారినపడిన అల్జీరియా విమానం పైన దర్యాప్తు చేపట్టిన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో రెండు రోజుల క్రితం జరిగిన అల్జీరియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు... విమానం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని భావిస్తున్నారు.
అందుకే ముక్కలుముక్కలై అర కిలోమీటరు పరిధిలో శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మృత్యువాతపడ్డారు. కొన్ని కుటుంబాలకు చెందిన వారంతా దుర్మరణం పాలయ్యారు.
ఫ్రాన్స్కు చెందిన ఒక కుటుంబంలోని 10 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కాలిపోయి, ఛిద్రమైన మృతుల అవయవాలు మాత్రమే లభ్యంకావడంతో మృతదేహాలను గుర్తించడం కుదరడం లేదంటున్నారు.
ప్రతికూల వాతావరణం వల్లే పైలట్ విమానాన్ని దారి మళ్లించి ఉండవచ్చునని చెబుతున్నారు. విమానం అంత బలంగా నేలను ఎందుకు ఢీకొట్టిందో తేలాల్సి ఉందంటున్నారు. విమాన శకలాల నుంచి రెండో బ్లాక్బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్లకు చెందినవారు ఉన్నారు.