ఇమ్రాన్కు చేదు అనుభవం : స్వాగతం పలకని యూఎస్ అధికారులు.. మెట్రోలోనే రాయబారి ఇంటికి పయనం..
వాషింగ్టన్ డీసీ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. ట్రంప్తో చర్చల నిమిత్తం ఆ దేశానికి వెళ్లిన ఆయనకు కనీస గౌరవం దక్కలేదు. ఎయిర్పోర్టులో యూఎస్ ఉన్నతాధికారులు స్వాగతం పలికేందుకు రాకపోగా.. కనీసం కారు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో మెట్రోలో ప్రయాణించి అమెరికాలో పాక్ రాయబారి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్న సమావేశాన్ని బెలుచిస్తాన్ మద్దతుదారులు అడ్డుకున్నారు.
స్వాగతం పలికేందుకు రాని ఉన్నతాధికారులు
పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా యూఎస్ పర్యటన కోసం ప్రైవేట్ జెట్ కాకుండా ఖతార్ ఎయిర్వేస్కు చెందిన కమర్షియల్ ఫ్లైట్లో ప్రయాణించారు. డల్లాస్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు యూఎస్ అధికారులు షాకిచ్చారు. చర్చల నిమిత్తం వచ్చిన ఇమ్రాన్కు స్వాగతం పలికేందుకు అమెరికా ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. ప్రోటోకాల్ కోసం పాక్ ప్రభుత్వం అమెరికాకు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైనా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అందుకు నిరాకరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి.
మెట్రోలో రాయబారి ఇంటికి ప్రయాణం
ఇమ్రాన్ ఖాన్కు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు వచ్చిన యూఎస్ ప్రోటోకాల్ చీఫ్ మేరీ కేట్ ఫిషర్ ఆయనను మెట్రో స్టేషన్ వరకు దిగబెట్టారు. అనంతరం పాక్ ప్రధాని మెట్రోలోనే తమ దేశ రాయబారి అసద్ మజీద్ ఖాన్ ఇంటికి చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అక్కడే బస చేయనున్న ఇమ్రాన్ జులై 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. ఇటీవల అమెరికా పాక్కు భద్రతా సాయాన్ని నిలిపివేసిన నేపత్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణ కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుందని పాక్ భావిస్తోంది. ఇదిలా ఉంటే మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ ఐఎంఎఫ్ చీఫ్ డేవిడ్ లిప్టన్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్తో సమావేశం కానున్నారు.
అడ్డుకున్న బెలుచిస్థాన్ మద్దతుదారులు
ఇదిలా ఉంటే వాషింగ్టన్ డీసీలోని ఓ స్టేడియంలో అమెరికాలో స్థిరపడ్డ పాక్ పౌరులను ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బెలూచిస్థాన్ మద్దతుదారులు కొందరు ఇమ్రాన్ ప్రసంగానికి అడ్డు తగిలారు. పాక్ బెలూచిస్థాన్ పౌరులకు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న అరాచకాలు, అక్కడి ఆర్మీ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడటంపై ఆందోళనకు దిగారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.