ట్రంప్ నిర్ణయం గుండె పగిలేలా చేసింది: మలాలా
యుద్దం, హింస వంటి ప్రతికూల పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు.. ఆశ్రయం కోరి వస్తున్నవారికి ట్రంప్ 'నో ఎంట్రీ' అని చెప్పడం బాధాకరమన్నారు మలాలా.
న్యూయార్క్: ముస్లిం శరణార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు తనను తీవ్రంగా కలచివేసిందని పాకిస్థానీ విద్యార్థి కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
యుద్దం, హింస వంటి ప్రతికూల పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు.. ఆశ్రయం కోరి వస్తున్నవారికి ట్రంప్ 'నో ఎంట్రీ' అని చెప్పడం బాధాకరమన్నారు మలాలా. అశాంతి, అనిశ్చితి విశ్వవాప్తంగా నెలకొన్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరికాదని మలాలా అన్నారు.
రక్షణలేని పిల్లలు, కుటుంబాలు, శరణార్థులుగా వస్తున్నప్పుడు.. వారిని ఆదరించాలని మలాలా విజ్ఞప్తి చేసింది. ముస్లిం దేశాల నుంచి వలస వస్తున్న శరణార్థులపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని, దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసిన ట్రంప్.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మలాలా సూచించారు.
ట్రంప్ ఆదేశాలు ఇంకా పూర్తిగా బహిర్గతం కానప్పటికీ.. శరణార్థులపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా ప్రకారం మూడు నెలల పాటు శరణార్థులను అమెరికాలోకి రాకుండా నిలిపివేయనున్నారు. ఈలోపు కొత్త నిబంధనలు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.
కాగా, విదేశీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి చేపడుతున్న చర్యల్లో భాగంగానే ముస్లిం శరణార్థుల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు ముసాయిదా ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇకపోతే 2014లో భారత్ కు చెందిన కైలాశ్ సత్యార్థితో పాటు మలాలా కూడా నోబెల్ బహుమతి అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మలాలా ఇంగ్లాండ్ లోనే ఉంటున్నారు.