డీఎన్ఏ గుట్టు రట్టు: కెమిస్ట్రీలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్
2015 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను దక్కింది. రసాయనశాస్త్ర రంగంలో విశేష సేవలందించినందుకు గాను థామస్ లిండాల్(ఇంగ్లాండ్), పాల్ మోడ్రిచ్(అమెరికా), అజీజ్ సాంకర్ (అమెరికా)లకు నోబెల్ పురస్కారం ప్రకటించారు.
డీఎన్ఏపై మరింత విస్తృతంగా పరిశోధనలు చేసి, జన్యు రహస్యాలను మరింతగా విడమరిచినందుకు గాను వీరికి ఈ అవార్డు లభించింది. కాగా ఆల్ ఫ్రెడ్ నోబెల్ కెరీర్లో రసాయన శాస్త్రం ఎంతో కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు కేవలం నలుగురు మహిళలకు మాత్రమే రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
1901 నుంచి 2014 వరకూ మొత్తం 169 మంది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు అందుకున్నారు. రసాయన, భౌతిక శాస్త్రంలోనూ నోబెల్ బహుమతి పొంది ఏకైక మహిళ మేడమ్ క్యూరీ మాత్రమే. రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న చిట్ట చివరగా 2009లో అదా యోనథ్ అనే మహిళకు దక్కింది. బ్రిటన్కు చెందిన ఫ్రెడ్రిక్ సంగర్ అనే వ్యక్తి రెండు సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
ఇక ఈ ఏడాది తొలి నోబెల్ పురస్కారాన్ని వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సోమవారం ప్రకటించారు. మంగళవారం భౌతిక రంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు రసాయన శాస్త్రంలో ప్రకటించారు. ఈ వారంలోనే శాంతి రంగాల్లో నోబెల్ బహుమతులు ప్రకటిస్తారు. ఆర్థిక విభాగంలో వచ్చే సోమవారం ప్రకటించనున్నారు.