ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్: పాలపుంతపై విస్తృత పరిశోధనలు చేసినందుకే
స్టాక్ హోమ్: అత్యంత సంక్లిష్టమైన ఫిజిక్స్ లో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. అంతరిక్షంలో కొన్ని వినూత్న పరిశోధనలు చేయడం, సరికొత్త గ్రహాలు, నక్షాత్రాలను కనుగొన్నందున వారికి ఈ అవార్డు లభించనుంది. జేమ్స్ పీబెల్స్, మైఖెల్ మేయర్, డిడియర్ క్వెలోజ్ లను ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ గోరాన్ హ్యాన్సన్ తెలిపారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
అంతరిక్షంపై విస్తృత పరిశోధనలు
ఫిజికల్ కాస్మాలజీలో విస్తృత పరిశోధనలు చేసినందుకు కెనడాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జేమ్స్ పీబెల్స్, స్విట్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ జెనీవా ప్రొఫెసర్ మైఖెల్ మేయర్ లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరితో పాటు సూర్యుడి తరహా మరో సరి కొత్త గ్రహాన్ని కనుగొన్నందుకు జెనీవా యూనివర్శిటీకే చెందిన డిడియర్ క్వెలోజ్ పేరును ఎంపిక చేశామని అన్నారు. మన పాలపుంతకు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి తరహా అత్యంత భారీ గ్రహం ఉందనే విషయాన్ని క్వెలోజ్ కనుగొన్నారు. దీనిపై విస్తృత పరిశోధనలను నిర్వహించారు. నోబెల్ అవార్డు కింద ఈ ముగ్గురికీ 918,000 అమెరికన్ డాలర్ల నగదు, బంగారు పతకం, డిప్లొమా సర్టిఫికెట్ ను అందజేస్తారు. మన దేశ కరెన్సీతో పోల్చుకుంటే ఈ నగదు బహుమతి విలువ ఆరున్నర కోట్ల రూపాయల పైమాటే.
ఫిజిక్స్.. సంక్లిష్టం
వచ్చే డిసెంబర్ 10వ తేదీన స్టాక్ హోమ్ లో నిర్వహించే కార్యక్రమం సందర్భంగా నోబెల్ బహుమతిని అందజేస్తామని గోరాన్ హ్యాన్సన్ స్పష్టం చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా వివిధ రంగాలకు సేవలు చేసిన వారికి నోబెల్ బహుమతిని అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఫిజిక్స్ లో నోబెల్ బహుమతిని ఇవ్వడాన్ని 1901లో ప్రారంభించారు. ఇప్పటిదాకా 47 మందికి మాత్రమే ఫిజిక్స్ లో నోబెల్ అవార్డు లభించింది. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఫిజిక్స్ లో నోబెల్ అవార్డును అందజేసేంత స్థాయిలో పరిశోధనలు చోటు చేసుకోనందున.. ఈ కేటగిరీలొో ఏటేటా అవార్డులను ఇవ్వలేదు.
రేపు కెమిస్ట్రీ కేటగిరీలో..
కెమిస్ట్రీ రంగంలో నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేసిన పేర్లను బుధవారం ప్రకటిస్తారు. స్టాక్ హోమ్ లోనే దీన్ని వెల్లడిస్తారు. అలాగే సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకునే వారి పేర్లను గురువారం వెల్లడించనున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి కోసం ఎవరిని ఎంపిక చేశారనేది శుక్రవారం వెల్లడవుతుంది. నిజానికి- సాహితీ రంగంలో ఒకరికే నోబెల్ బహుమతిని అందించాల్సి ఉంటుంది. 2018లో ఈ కేటగిరీలో ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. ఫలితంగా- ఈ సారి 2018, 2019 కోసం అర్హులైన వారిని ఎంపిక చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
వైద్యంలో ముగ్గురికి..
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్య రంగంలో విస్తృత కృషి చేసినందుకు విలియం జీ కేలిన్, సర్ పీటర్ రాట్ క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజాలకు నోబెల్ బహుమతి వరించింది. తక్కువ శాతం ఆక్సిజన్ అందిన సమయంలో మానవ శరీరంలోని పలు భాగాలు ఎలా స్పందిస్తాయనే అంశంపై వారు పరిశోధనలు సాగించారు. శరీరానికి అవసమైన ఆక్సిజన్ స్థాయి అందలేని సమయంలో ఎరిత్రో పోయెటిన్ హార్మోన్ లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని, ఫలితంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని వారి పరిశోధనలో తేలింది. ఈ మార్పుల వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుందని రుజువు చేశారు.