మెదడులో జీపీఎస్ ఆవిష్కరణ: ముగ్గురికి నోబెల్ ప్రైజ్
మెదడులో దిశానిర్దేశనం జరిగే తీరును వీరు వెలుగులోకి తెచ్చారు. ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన స్థితిని తెలుసుకోవడానికి దోహదపడే పొజిషనింగ్ వ్యవస్థ (అంతర్గత జీపీఎస్)ను కనుగొన్నారు. ఈ పరిశోధన.. అల్జీమర్స్, మెదడుకు సంబంధించిన ఇతర వ్యాధులకు చికిత్సలు చేయడానికి దోహదపడుతుందని నోబెల్ జ్యూరీ వివరించింది.
ఎలాంటి పరిసర వాతావరణానికైనా అలవాటు పడిపోయే అంతరంగ జిపిఎస్ మెదడుకు ఉంటుందన్న అరుదైన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ఈ ముగ్గురు వైద్యులను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు జ్యూరీ ప్రకటించింది. శతాబ్దాలుగా తత్వవేత్తలు, శాస్తవ్రేత్తలకు అంతుబట్టని మెదడు అంతర్గత నిర్మాణానికి సంబంధించిన అరుదైన అంశాన్ని ఈ ముగ్గురూ వెలుగులోకి తీసుకురాగలిగారని నోబెల్ జ్యూరీ వివరించింది.
మన చుట్టూవున్న వాతావరణానికి సంబంధించి మెదడులో ఏ విధంగా మ్యాపింగ్ జరుగుతుంది.. దానికి అనుగుణంగా మన మార్గాన్ని ఎలా ఎంపిక చేసుకుంటామన్నది.. ఈ ముగ్గురి నిరుపమాన పరిశోధనా సారాంశం. ఈ వ్యవస్థ తొలి భాగాన్ని 1971లోనే ఓ కీఫె కనిపెట్టారు. మెదడులో పరిసరాల మ్యాపింగ్కు సంబంధించిన కణాలు ఏవిధంగా స్పందిస్తాయో నిర్థారించారు.
మూడు దశాబ్దాల తర్వాత నార్వే దంపతులు ఇదే మార్గంలో తమ పరిశోధనలు కొనసాగించి మెదడు జిపిఎస్ వ్యవస్థను మరింత స్పష్టంగా వెలుగులోకి తేగలిగారు. ఓ కీఫే పరిసరాలకు సంబంధించిన మెదడు కణాలను గుర్తిస్తే.. ఈ జంట గ్రిడ్ కణాలను నిర్థారించింది. దీని వల్లే పరిసరాలకు తగినట్టుగా మెదడు మార్పులను సంతరించుకుంటుందని తెలిపారు.
అసలు జ్ఞాపకాలు ఏలా ఏర్పడతాయి, వాటిని గుర్తు తెచ్చుకోవాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన దృశ్య రూపం మన మనోఫలకాలపై ఎలా ఏర్పడుతుందన్న విషయాన్ని గ్రిడ్ కణాలపై జరిగే తదుపరి పరిశోధనలు మరింతగా విశదీకరిస్తాయి. మెదడు జీపీఎస్ను వంటబట్టించుకుంటే అల్జిమీర్స్ సహా అనేక జటిల రుగ్మతలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.