నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ నేపథ్యంపై నెటిజెన్ల ఆసక్తి
Recommended Video
వాషింగ్టన్: ఆర్థికశాస్త్రంలో 2019 నోబెల్ పురస్కారం అభిజీత్ వినాయక్ బెనర్జీతో పాటుగా ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో, మరియు మైఖేల్ క్రెమర్లను సంయుక్తంగా వరించింది. ప్రపంచ పేదరిక నిర్మూలనపై వీరు చేసిన కృషికిగాను ఈ అవార్డు లభించింది. ఇంతకీ అభిజీత్ బెనర్జీ నేపథ్యం ఏమిటి..? ఆయన ఎవరు అనేదానిపై నెటిజెన్లు విపరీతంగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
2019 ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి
అభిజీత్ బెనర్జీ... 2019వ సంవత్సరానికిగాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. అసలే ఆర్థికమాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత్కు భారత సంతతి వ్యక్తికి ఆర్థికశాస్త్రంలో నోబెల్ దక్కిందన్న విషయం బయటకు రాగానే నెటిజెన్లు అభిజీత్ బెనర్జీ బయోడేటాను వెతకడం ఇ:టర్నెట్లో వెతకడం ప్రారంభించారు. అతని గురించి తెలుసుకుంటున్నారు.
కోల్కతాలో జన్మించిన అభిజీత్ ఆపై...
అభిజీత్ వినాయక్ బెనర్జీ భారత్లో జన్మించారు. కోల్కతాలో నిర్మలా బెనర్జీ, దీపక్ బెనర్జీలకు 21 ఫిబ్రవరి 1961లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 58 ఏళ్లు. తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తించారు.తల్లి ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్ కోల్కతాలో పనిచేయగా తండ్రి దీపక్ బెనర్జీ ప్రెసిడెన్సీ కాలేజీలో ఆర్థికశాస్త్రం హెచ్ఓడీగా పనిచేశారు. ఇక అభిజీత్ బెనర్జీ ప్రాథమిక విద్య సౌత్ పాయింట్ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం 1981లో ప్రెసిడెన్సీ కాలేజ్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత1983లో ఢిల్లీలోని జవహర్లాల్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేశారు. 1988లో అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎస్సే ఇన్ ఇన్ఫర్మేషన్ ఎకనామిక్స్పై థీసిస్ సమర్పించి డాక్టొరేట్ పొందారు.
ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న అభిజీత్
బెనర్జీ ప్రస్తుతం ప్రముఖ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ఆయన హార్వర్డ్ యూనివర్శిటీ, ప్రిన్స్టన్ యూనివర్శిటీలో పాఠాలు బోధించారు. అభిజీత్ ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి పైనే పనిచేశారు. ఆర్థికరంగంలో ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్లు ద్వారానే మంచి ఆర్థికవ్యవస్థతో సంబంధాలు ఏర్పడుతాయని చెబుతూ అతని భార్య ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్, జాన్ ఏ లిస్ట్, సెందిల్ ముల్లయినాథన్లతో కలిసి పనిచేశారు. 2004లో అభిజీత్ ఫెలో ఆఫ్ ది అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కు ఎంపికయ్యారు. 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఆయన్ను వరించింది.
యూఎన్ నిపుణుల బృందంలో సభ్యులు
అభిజీత్ బెనర్జీ భార్య ఎస్తేర్ డఫ్లోతో కలిసి పూర్ ఎకనామిక్స్ అనే పుస్తకం రాయడంతో 2012లో గెరాల్డ్ లోయెబ్ అవార్డు ఈ దంపతులను వరించింది. "2015 మిలినియమ్ డెవలప్మెంట్ గోల్స్"కు ఏర్పాటు చేసిన నిపుణుల బృందంలో అభిజీత్ బెనర్జీని ఐక్యరాజ్యసమితి అప్పటి ప్రధాన కార్యదర్శి బాన్-కీ- మూన్ ఎంపికచేశారు.
చిన్ననాటి స్నేహితురాలితో వివాహం..ఆపై విడాకులు
అభిజీత్ బెనర్జీ డాక్టర్ అరుందతి తులి బెనర్జీని వివామాడారు. ఆమె ఎమ్ఐటీలో లిటిరేచర్లో లెక్చరర్గా పనిచేసేవారు. కోల్కతాలో ఉన్న సమయంలోనే ఇద్దరికి పరిచయం ఉండేది. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 1991లో పుట్టిన కుమారుడికి కబీర్ బెనర్జీ అని పేరు పెట్టారు. 2016లో కబీర్ చనిపోయాడు. ఇక తన సహచరురాలు అయిన ఎస్తేర్ డఫ్లోతో 18 నెలల పాటు సహజవీనం చేశారు. డఫ్లోతో 2012లో మరో బిడ్డకు జన్మనిచ్చారు.ఇక 2015లో ఎస్తేర్ను అభిజీత్ బెనర్జీ వివాహం చేసుకున్నారు.