దక్షిణ కొరియాతో యుద్ధం: కీలక కార్యాలయాన్ని పేల్చేసిన ఉత్తర కొరియా: సరిహద్దుల్లో బాంబులమోత
సియోల: దక్షిణ కొరియాతో యుద్ధానికి కాలు దువ్వుతోంది ఉత్తర కొరియా. కొద్దిరోజుల కిందటే కమ్యూనికేషన్ల వ్యవస్థను నిలిపి వేసిన ఉత్తర కొరియా.. తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. దక్షిణ కొరియాతో అనుసంధానించడానికి ఏర్పాటు చేసిన ఓ దౌత్య కార్యాలయాన్ని పేల్చేసింది. దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉండే కార్యాలయం ఇది. రెండు దేశాల మధ్య రాకపోకలు సాగించడానికి, సరిహద్దులను దాటుకోవడానికి అవసరమైన అనుమతులను జారీ చేయడానికి ఉద్దేశించిన కార్యాలయాన్ని బాంబులతో పేల్చేసింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణానికి దారి తీసింది.
లైజనింగ్ కార్యాలయం పేల్చివేతతో
ఆధునిక నియంతగా పేరు తెచ్చుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్జొంగ్ ఉన్ ఆదేశాల మేరకు ఈ లైజనింగ్ కార్యాలయాన్ని పేల్చేసి ఉండొచ్చని దక్షిణ కొరియా నుంచి వెలువడే స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియాతో దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం బాధ్యతలు ప్రస్తుతం కిమ్జొంగ్ ఉన్ చెల్లెలు కిమ్ యో జొంగ్ పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకే కిమ్ నడుచుకుంటున్నారనే అంటున్నారు.
కిమ్ యో జోంగ్ ఆదేశాలతో..
కిమ్ యో జొంగ్ చేసిన సిఫారసులను దృష్టిలో ఉంచుకుని కొద్దిరోజుల కిందటే దక్షిణ కొరియాతో అన్ని రకాల కమ్యూనికేషన్ల వ్యవస్థను తెంచేసింది ఉత్తర కొరియా. ఇద్దరు దేశాధినేతల మధ్య సంభాషణలను కొనసాగించడానికి ఉద్దేశించిన ప్రత్యేక హాట్లైన్లతో సహా ఎలాంటి సమాచార వ్యవస్థ కూడా ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య అనుసంధానించి లేదు. అదే సమయంలో లైజనింగ్ కార్యాలయాన్ని కూడా పేల్చేయడం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
అత్యవసర భేటీ ముగిసిన 24 గంటల్లో
యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ కిమ్ జొంగ్ ఉన్ చెల్లెలు సూచనప్రాయంగా దక్షిణ కొరియాకు హెచ్చరికలను జారీ చేశారు. ఈ హెచ్చరికలు అందిన నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఉత్తర కొరియా ఎలాంటి అడుగులనైనా వేయడానికి సిద్ధంగా ఉందని, దాన్ని ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాలంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఈ సమావేశం ముగిసిన రెండో రోజే లైజనింగ్ కార్యాలయాన్ని పేల్చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మిలటరీ కమ్యూనికేషన్లు కూడా..
మిలటరీ కమ్యూనికేషన్ల వ్యవస్థను కూడా తొలగింపుల జాబితాలోకి చేర్చడం ఉత్తర కొరియాకు ఉన్న అసహనాన్ని స్పష్టం చేసినట్టయిందని చెబుతున్నారు. ఈస్ట్, వెస్ట్ సీస్ కమ్యూనికేషన్ లైన్లు, రెండు దేశాల మిలటరీతో లింకప్ అయి ఉండే సమాచార వ్యవస్థలపైనా దానీ ప్రభావం పడింది. దక్షిణకొరియాతో కుదుర్చుకున్న మిలటరీ అగ్రిమెంట్లను రద్దు చేయడానికి కూడా ఉత్తర కొరియా వెనుకాడకపోవచ్చని అంటున్నారు. 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ పర్యటన సందర్భంగా ఈ రెండు దేశాల మధ్య మిలటరీ ఒప్పందం కుదిరింది.