మా వద్ద హైడ్రోజన్ బాంబు ఉంది: కిమ్, అనుమానం
సియోల్: తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని ఉత్తర కొరియా గురువారం స్పష్టం చేసింది. అది అధికారికంగా రుజువైతే హైడ్రోజన్ బాంబు కలిగి ఉన్న దేశంగా ఇప్పటి నుంచి ఉత్తర కొరియాను కూడా పరిగణించవలసి ఉంటుంది. అలాంటి బాంబు తయారు చేసే దిశగా ఉత్తర కొరియా ముందడుగు వేస్తున్నట్లు ఇటీవలే తెలిసింది.
తమ దేశం హైడ్రోజన్ బాంబు (ఉదజని బాంబు)ను అభివృద్ధి చేసిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించాడు. తక్కువ శక్తివంతమైన అణుబాంబు అనంతరం ఈ విధ్వంసకర విస్ఫోటక పదార్థాన్ని తయారు చేసినట్లు అతను తెలిపాడు.
అతని వ్యాఖ్యల పైన పాశ్యాత్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఆ బాంబును తయారు చేసుకునే పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందా లేదా అనే విషయం మాత్రం స్ఫష్టంగా తెలియదు. ఒక హైడ్రోజన్ బాంబు అటామిక్ బాంబుల కంటే వంద రెట్లు శక్తిమంతమైనది.
ఫ్యాంగ్ ఛాన్ ప్రాంతం సందర్శన సమయంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. తమ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ 2 సంగ్ కృషి వల్ల ఉత్తర కొరియా శక్తివంతమైన అణ్వస్త్రం కలిగిన దేశంగా ఆవిర్భవిచిందని కిమ్ జాంగ్ ఉన్న చెప్పాడు.
తమ వద్ద పరీక్షించేందుకు అటామిక్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు సిద్ధంగా ఉన్నాయని, అవి తమ దేశ సార్వభౌమత్వాన్ని, దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తాయని భావిస్తున్నామని కిమ్ జాంగ్ ఉన్న చెప్పాడు. కాగా, హైడ్రోజన్ బాంబును థర్మో న్యూక్లియర్ బాంబు అని కూడా పిలుస్తుంటారు.