రాయబారిని అతడి భార్యను కొట్టిన పాక్ అధికారులు, అగ్గిమీద గుగ్గిలమైన ఉత్తర కొరియా
పాకిస్తాన్లో ఉత్తర కొరియా రాయబారి, అతడి భార్యపై దాడి జరిగింది. స్వయంగా పాక్ చెందిన పన్నుశాఖ అధికారులే ఇంటికెళ్లి మరీ వారిని కొట్టారు. ఈ వార్త తెలియగానే ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలమైంది.
కరాచీ: పాకిస్తాన్లో ఉత్తర కొరియా రాయబారి, అతడి భార్యపై దాడి జరిగింది. స్వయంగా పాక్ చెందిన పన్నుశాఖ అధికారులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికెళ్లి మరీ వారిని కొట్టారు. ఈ వార్త తెలియగానే ఉత్తర కొరియా అగ్గిమీద గుగ్గిలమైంది.
ఈ చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని, కచ్చితంగా దెబ్బతింటాయని హెచ్చరించింది. పాక్ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ అధికారులకు ఉత్తర కొరియా రాసిన లేక ప్రకారం.. పాక్ పన్నుశాఖకు చెందిన పది మంది అధికారులు ఆయుధాలు ధరించి కరాచీలోని ఉత్తర కొరియా రాయబారి ఇంటికెళ్లారు.
అనంతరం రాయబారిపై దాడి చేయడమే కాకుండా అతడి భార్యను జుట్టుపట్టుకొని ఈడ్చి ఇద్దరిని కొట్టారు. వారి తలపై తుపాకులు ఎక్కు పెట్టి తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా గోడకు ఉన్న ఫొటోలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఏప్రిల్ 9న చోటు చేసుకుంది.
ఈ ఘటనను తీవ్రంగా భావించిన ఉత్తర కొరియా అంతర్గత వ్యవహారాల మంత్రి పాక్కు తీవ్ర స్థాయిలో హెచ్చరిక లేఖ రాశారు. ఇప్పటికే తామొక ఉన్నత స్థాయి కమిటీని వేశామని, ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుంటే మాత్రం స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని పేర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తామే వారిని గుర్తించి తమకు నచ్చిన చర్యలు తీసుకుంటామని కూడా ఆ లేఖలో ఉత్తరకొరియా అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్చరించారు. అయితే, కరాచీలో దాడికి గురైన ఉత్తరకొరియా రాయబారి నిర్వహిస్తున్న విధుల వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఈ లేఖపై స్పందించిన పాక్ ఉన్నతాధికారి షోయబ్ సిద్ధిఖీ, తాము కూడా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, దాడికి పాల్పడింది ఎవరన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.