హెచ్చరికలు భేఖాతరు: ఐదోసారి ఉత్తర కొరియా అణుపరీక్ష
ప్యోంగ్యాంగ్: అగ్ర దేశాలు హెచ్చరికలు చేస్తున్నా.. ఉత్తర కొరియా తన దూకుడును ఏ మాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఐదవ సారి అణు పరీక్షను చేపట్టింది. విజయవంతంగా ఆ పరీక్ష జరిగినట్లు ఉత్తర కొరియా శుక్రవారం స్పష్టం చేసింది. కాగా, అణు పరీక్ష నిర్వహించిన ప్రాంతంలో భారీ స్థాయిలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఆ దేశానికి చెందిన అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
కాగా, ఉత్తర కొరియా ఈ సారి నిర్వహించిన అణు పరీక్ష అత్యంత భారీ పరిణామంలో జరిగినట్లు దక్షిణ కొరియా పేర్కొంది. ఎన్ని ఆంక్షలు విధించినా ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలతో ముందుకు వెళ్తోందని దక్షిణ కొరియా అనుమానాలు వ్యక్తం చేసింది.
శుక్రవారం ఉదయం నిర్వహించిన అణు పరీక్ష వల్ల 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పుంగెయి-రి అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించే ప్రాంతానికి చేరువలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రస్తుతం నిర్వహించిన అణు పరీక్ష సామర్థ్యం 10 కిలోటన్నులు ఉంటుందని దక్షిణ కొరియా అంచనా వేసింది.
ఉత్తర కొరియా చర్యలు విధ్వంసకరంగా ఉన్నాయని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గున్ తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్ వ్యవహారశైల పిచ్చిపట్టినట్టుగా ఉందన్నారు. ఉత్తర కొరియా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా కూడా హెచ్చరించింది.
ఉత్తర కొరియా చేపట్టిన అణు పరీక్షను చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యలకు పాల్పడరాదని, లేదంటే పరిస్థితి క్షీణిస్తుందని చైనా హెచ్చరించింది. జపాన్ కూడా ఉత్తర కొరియా అణు పరీక్ష పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను జపాన్ ప్రధాని షింజో అబే ఖండించారు. ఈ ఘటన తర్వాత అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా స్పందించారు. కాగా, జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలతో ఒబామా మాట్లాడారు.