ట్రంప్తో భేటీ కోసం రైల్లో వియత్నాంకు బయల్దేరిన కిమ్ జాంగ్ ఉన్, 48 గంటల ప్రయాణం
ప్యోంగ్యాంగ్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్లు వియత్నాంలో భేటీ కానున్న విషయం తెలిసిందే. వీరిద్దరు భేటీ కానున్నట్లు ఉత్తర కొరియా శనివారం తెలిపింది. తమ దేశాధినేత కిమ్ వియత్నాంకు వెళ్తున్నారని, ఆయన రైల్లో ఉన్నారని చెప్పింది. ట్రంప్-కిమ్లు గతంలోను ఓసారి భేటీ అయ్యారు. ఇది రెండో భేటీ.
కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణిస్తున్న రైలు ప్యోంగ్యాంగ్ నుంచి బయలుదేరిందని, చైనా మీదుగా వియత్నాం వెళ్తుందని నార్త్ కొరియా తెలిపింది. పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే రైళ్లు చైనీస్ బార్డర్ అయిన దన్డోంగ్ నగరాన్ని దాటినట్లుగా రష్యాకు చెందిన మీడియా సంస్థ వెల్లడించింది.
కిమ్ జాంగ్ ఉన్, డొనాల్డ్ ట్రంప్లు ఫిబ్రవరి 27, 28వ తేదీల్లో భేటీ కానున్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి హనోయి వరకు 2700 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి 48 గంటల సమయం తీసుకుంటుంది.
అంతకుముందు, వియత్నాం విదేశాంగ మంత్రి ట్వీట్ చేస్తూ... కిమ్ జాంగ్ ఉన్ వియత్నాం రాబోతున్నారని, ఇది అధికారిక ఫ్రెండ్లీ విజిట్ అని పేర్కొన్నారు. తదుపరి సమావేశంలో ఉత్తర కొరియా డీన్యూక్లియరైజేషన్ విషయంలో అర్థవంతంగా ఉండాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు.
ఇటీవల శ్వేతసౌధంలో ట్రంప్ మాట్లాడుతూ.. వారు (ఉత్తర కొరియా) ఏదో ఒకటి చేయాలని అణుపరీక్షలను ఉద్దేశిస్తూ చెప్పారు. అలాగే, తదుపరి జరగబోయే సమావేశం చివరిది అని తాను అనుకోవడం లేదని చెప్పారు. కాగా, కిమ్ జాంగ్ ఉన్, డొనాల్డ్ ట్రంప్లు గత ఏడాది సింగపూర్లో మొదటిసారి భేటీ అయ్యారు.