కిమ్ బతికే ఉన్నాడన్న వార్త రాగానే దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా కాల్పులు..!
నిన్న మొన్నటి వరకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మృతి చెందారంటూ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే నిన్నటితో ఉత్తరకొరియా నుంచి విడుదలైన ఓ వీడియో చూస్తే కిమ్ మృతి వార్తపై క్లారిటీ వచ్చింది. ఓ కర్మాగారం ప్రారంభిస్తున్న వీడియో విడుదల కావడంతో ఆయన మరణవార్తలకు చెక్ పెట్టినట్లయ్యింది.
Recommended Video
ఇక కిమ్ మృతి చెందలేదు బతికే ఉన్నారంటూ ఉత్తరకొరియా దాయాది దేశం దక్షిణ కొరియా గంటాపథంగా చెప్పింది. అయినప్పటికీ నియంత మృతి చెందారంటూ ఆ దేశంతో సంబంధం ఉన్న పలువురు చెబుతూ వచ్చారు. ఇక రెండు దేశాల మధ్య గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఉత్తర కొరియా దక్షిణ కొరియా సరిహద్దుల్లో తుపాకుల మోత మోగింది.
ఉత్తరకొరియా దక్షిణ కొరియా దేశాలను వేరు చేసే సరిహద్దు రేఖ వద్ద ఉత్తర కొరియా కాల్పులకు తెగబడింది. దక్షిణ కొరియా గార్డ్ పోస్టు పైకి కాల్పులు జరిపింది. దీంతో దక్షిణ కొరియా కూడా అంతే స్థాయిలో స్పందించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్పష్టం చేశారు.
ఆదివారం రోజున స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 7:41 గంలటకు ఉత్తరకొరియా కాల్పులకు తెగబడిందని దక్షిణకొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు. అయితే కాల్పులు జరుపుతున్న సమయంలో ముందుగా దక్షిణాఫ్రికా మాటలతో హెచ్చరించిందని చెప్పిన జేసీఎస్... మాట వినకపోవడంతో తన తుపాకులకు కూడా పనిచెప్పినట్లు వివరించారు.
ఇదిలా ఉంటే తాజా పరిస్థితులపై మిలటరీ సమీక్షిస్తోందని దక్షిణ కొరియా పేర్కొంది. మళ్లీ ఉత్తరకొరియా దాడులకు దిగే అవకాశం ఉండటంతో సరిహద్దులో తమ బలగాలను మోహరించింది దక్షిణకొరియా. ఇదిలా ఉంటే 2018లో రెండు దేశాల మధ్య మిలటరీ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఇరు దేశాలు 11 గార్డు పోస్టులను సరిహద్దు వెంబడి ధ్వంసం చేసేందుకు అంగీకరించారు. కానీ ఇంకా డీమిలటరైజేషన్ జోన్లో పలు గార్డ్ పోస్టులు ఉన్నాయి.
గతంలో కూడా ఈ సరిహద్దు రేఖ వెంబడి కాల్పులు జరిగాయి. 2017 ఉత్తరకొరియాకు సంబంధించిన సైనికుడు ఒకరు సరిహద్దు రేఖ దాటి దక్షిణకొరియాలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో కాల్పులు రెండు దేశాల మధ్య జరిగాయి. 2014లో కూడా నియంత పాలనకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా నుంచి దక్షిణకొరియాలోకి వచ్చిన ఒక సంస్థ బెలూన్లను ఎగురవేసింది.