మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతోన్న ఉత్తరకొరియా..ఈ సారి కిమ్ ఏంచేశాడంటే..?
ఉత్తరకొరియా: ఉత్తరకొరియా మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. ఉత్తరకొరియా తూర్పు తీరం నుంచి రెండు క్షిపణులు సముద్రంలో పరీక్షించినట్లు దక్షిణకొరియా మిలటరీ చీఫ్ చెప్పారు. అణ్వాస్త్రాల పరీక్షలను నిలిపివేయాలని అమెరికా ఉత్తరకొరియా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే కిమ్ జాంగ్ ఉన్ క్షిపణులు పరీక్షించడం చర్చనీయాంశమైంది. తూర్పు తీరంలో ఉన్న వాన్సన్ నగరం నుంచి పరీక్షించిన క్షిపణులు 430 కిలోమీటర్లు మేరా ప్రయాణించి సముద్రంలో పడిపోయినట్లు దక్షిణ కొరియా మిలటరీ చీఫ్ చెప్పారు. ఇదిలా ఉంటే క్షిపణి జపాన్ ఎకనామిక్ జోన్ వరకు రాలేదని తమ దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని జపాన్ రక్షణశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
జూన్ చివరిలో అణ్వాయుధాలకు స్వస్తి పలకాలంటూ ట్రంప్-కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఉత్తర కొరియా ఈ క్షిపణులు ప్రయోగించడం చూస్తే అగ్రరాజ్యం ఆదేశాలను బేఖాతరు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా జరిపిన క్షిపణి పరీక్షలపై ఇటు వైట్హౌజ్ కానీ , అటు పెంటగాన్ కానీ స్పందించలేదు. అయితే ఒక క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించినట్లు తమకు సమాచారం అందిందని దీనిపై విశ్లేషణ జరుపుతున్నామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
జూన్ చివరిలో ఉత్తరకొరియా దక్షిణ కొరియా సరిహద్దుల్లో ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ చర్చలు జరిపారు. అణ్వాయుధాలను వీడాలని దీనిపై మరోమారు చర్చలు జరుపుతామని ఇద్దరు నేతలు చెప్పారు. అయితే ఈలోగా అమెరికా దక్షిణ కొరియా బలగాలు సంయుక్త మిలటరీ డ్రిల్ను నిర్వహించాలని భావించాయి. ఇదే ఆలోచన ఉత్తరకొరియాకు రుచించకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఇక అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వచ్చేవారం బ్యాంకాక్ వేదికగా జరిగే ఆసియాన్ సదస్సు సందర్భంగా భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ భేటీపై ఇంకా స్పష్టత రాలేదు.