అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే! కిమ్లో మార్పుకు కారణం అదేనా? సమావేశంపై ట్రంప్ ఇలా..
వాషింగ్టన్: నిన్న మొన్నటి వరకు అణ్వాయుధాలతో సర్వనాశనం చేస్తామని హెచ్చరికలు జారీ చేసుకున్న అమెరికా, ఉత్తరకొరియాలు చర్చలకు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు దేశాధినేతల మధ్య చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కిమ్తో జరగబోయే సమావేశం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ నేత రిక్ సాకోన్ నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఆయన కిమ్ జాంగ్ ఉన్ తో జరిగే సమావేశంపై మాట్లాడుతూ 'జరిగితే అద్భుతం జరుగుతుంది.. లేదంటే ఏమీ ఉండదు..' అని వ్యాఖ్యానించారు.
ప్రపంచ దేశాల దృష్టి ఆ ఇద్దరిపైనే...
ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఒకే ఒకదానిపై ఉంది. అదే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగే చర్చలు. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొన్న ఉత్తర కొరియా ఆ సమయంలోనే తాను అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధం అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కిమ్తో ట్రంప్ భేటీ ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే చర్చలు జరిగే వరకూ ఉత్తరకొరియా సంయమనం పాటించడం కూడా అత్యంత ముఖ్యమైన అంశం.
జరిగితే అద్భుతం, లేదంటే...
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో జరగబోయే సమావేశం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'కిమ్తో జరిగే భేటీలో ఎలాంటి ఒప్పందం జరగకపోవచ్చు.. లేదా ప్రపంచం మొత్తానికి మేలు జరిగే ఫలితం రావొచ్చు..' అని అన్నారు. అయితే ముందుగానే ఏమీ ఊహించలేమని, కిమ్తో చర్చలు ఎలాంటి ఫలితాన్నివ్వని పక్షంలో తాను వెంటనే బయల్దేరి వచ్చేస్తానని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
ఇక బలప్రదర్శనలు ఉండవు...
ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య అణుపరమైన అంశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మొన్నమొన్నటి వరకు నువ్వొకటి అంటే నేను రెండు అంటానంటూ బాంబుల వర్షం కురిపించి సర్వనాశనం చేస్తానంటూ ట్రంప్, కిమ్ ఇరువురు కూడా పరస్పరం హెచ్చరికలు చేసుకున్నారు. ప్రస్తుతం ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయని, గత నవంబర్ నుంచి ఉత్తరకొరియా ఎలాంటి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించడం లేదని, ఇకమీదట కూడా వారు ఎలాంటి పరీక్షలు నిర్వహించరని ఆశిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించబోమని ఆయన తెలిపారు.
కిమ్ మారడానికి కారణాలివే...
ఆంక్షల విధింపు, తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి రాజ్ షా మాటలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ‘ఒత్తిడి తీసుకురావడమే మా విధానం.. అయితే ఈసారి ఆ ఒత్తిడి మా భాగస్వామ్య దేశాల నుంచి, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం గల దేశాల నుంచి.. అలాగే చైనా నుంచి కూడా వచ్చింది. ఇది కిమ్ను, అతడి ప్రవర్తనను చాలా ప్రభావితం చేసింది..' అని ఆయన పేర్కొన్నారు. మున్ముందు అణు పరీక్షలు నిర్వహించబోమని ఉత్తరకొరియా హామీ ఇవ్వడంతోనే ఈ చారిత్రాత్మక ముందడుగు పడిందని తెలిపారు.
చారిత్రాత్మక చర్చలు.. మే నెలలో...
‘ఉత్తరకొరియాతో ఒప్పందానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది పూర్తయితే ప్రపంచానికి శుభపరిణామమే. సమయం, స్థలం నిర్ధారణ కావాల్సి ఉంది' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. దక్షిణకొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ యి యాంగ్తో చర్చల తర్వాత ట్రంప్ నుంచి ఈ ప్రకటన రావడంతో అన్ని దేశాల దృష్టి దీనిపై నిలిచింది. ట్రంప్-కిమ్ మధ్య మే నెలలో చారిత్రాత్మక శిఖరాగ్ర చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అమెరికా అధ్యక్షులెవరూ ఇలాంటి చొరవ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ట్రంప్ మాత్రం కిమ్తో కలిసి ‘హ్యామ్బర్గర్' తినడానికి ఉత్సాహంగా ఉన్నట్లు ప్రకటించారు.