రహస్య నివేదిక లీక్... మళ్లీ భయపెడుతున్న కిమ్... ఉ.కొరియాలో అసలేం జరుగుతోంది...
ఉత్తరకొరియాకు సంబంధించి ఐక్యరాజ్య సమితి రహస్య నివేదిక ఒకటి బయటకు లీక్ అవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ నివేదిక ప్రకారం బహుశా ఉత్తర కొరియా తమ బాలిస్టిక్ క్షిపణుల వార్ హెడ్స్లో అమర్చేందుకు మినీ అణ్వాయుధ పరికరాలను అభివృద్ది చేసి ఉండవచ్చునని చాలా దేశాలు భావిస్తున్నాయి.
Recommended Video
ఉత్తర కొరియా గతంలో ఆరుసార్లు అణు పరీక్షలను చేపట్టడం ఈ మినీ అణ్వాయుధ పరికరాల అభివృద్దికి దోహదపడినట్లు ఆ దేశాలు విశ్వసిస్తున్నాయి. ఐరాస ఆంక్షలను పర్యవేక్షించే ఓ స్వతంత్ర సభ్యుల కమిటీ రూపొందించిన ఈ రహస్య నివేదిక ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఆగని అణ్వాయుధ కార్యకలాపాలు..
'డెమెక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇప్పటికీ తమ అణ్వాయుధ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అలాగే అత్యంత నాణ్యమైన యురేనియం ఉత్పత్తితో పాటు ప్రయోగాత్మకంగా లైట్ వాటర్ నిర్మాణాన్ని చేపడుతోంది. కొరియా ఇప్పటికీ అణ్వాయుధాల ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు ఓ సభ్య దేశం కూడా అభిప్రాయపడింది.' అని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నివేదికపై స్పందించేందుకు న్యూయార్క్లోని ఐరాస కార్యాలయాన్ని అంతర్జాతీయ మీడియా సంప్రదించగా... దానిపై స్పందన రాలేదు.
కిమ్ స్టేట్మెంట్కు భిన్నంగా వాస్తవాలు...
గతవారమే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్... ఇకపై ఎలాంటి యుద్దాలు ఉండబోవని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేశ భద్రతకు,భవిష్యత్తుకు అణ్వాయుధాలు ఒక భరోసాగా ఉన్నందునా... బయటినుంచి ఎలాంటి ఒత్తిళ్లు,సైనికపరమైన బెదిరింపులు ఉన్నప్పటికీ యుద్దం జోలికి వెళ్లదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే ఇంతలోనే ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లుగా ఐరాస రిపోర్టు వెలుగులోకి రావడంతో... కిమ్ ప్రకటనలో విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంక్షలను ఉల్లంఘిస్తున్న ఉ.కొరియా...
భవిష్యత్తులో మల్టిపుల్ వార్ హెడ్ సిస్టమ్స్ను అభివృద్ది చేయడానికి,వాటి సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడానికి,టెక్నాలజీ మెరుగులు దిద్దడానికి ఉత్తరకొరియా ప్రయత్నాలు సాగించవచ్చునని ఓ దేశం అంచనా వేసినట్లుగా ఐరాస రిపోర్టులో నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆ దేశం పేరును మాత్రం ప్రస్తావించలేదు. అణ్వాయుధ,బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమాలపై 2006 నుంచి ఉత్తరకొరియాపై నిషేధం విధించినప్పటికీ... ఆ దేశం మాత్రం ఆంక్షలను ఉల్లంఘిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. సముద్ర మార్గం ద్వారా అక్రమ బొగ్గు ఎగుమతులను కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
పురోగతి లేని చర్చలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 2018లో సింగపూర్లో, 2019లో వియత్నాంలో భేటీ అయ్యారు. కానీ ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అంతకుముందు అణ్వాయుధ కార్యకలాపాలను నిలిపివేయాలంటూ ఐరాస,అమెరికా ఉత్తర కొరియాపై పలు ఆంక్షలు విధించాయి. అమెరికా అణు నిరాయుధీకరణను డిమాండ్ చేస్తోంది. అయితే అందుకు ఒప్పుకోవాలంటే తమను అణ్వాయుధ దేశంగా గుర్తించాలని ఉత్తర కొరియా కోరుతోంది. ఈ రెండు అంశాలపై ట్రంప్,కింగ్ మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదు. ఇప్పటికీ ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తాజా ఐరాస రిపోర్టులో వెల్లడవడంతో కిమ్ ఏం చేయబోతున్నారన్న సస్పెన్స్ను నెలకొంది.