చారిత్రాత్మక చర్చలు: అణుపరీక్షలు ఆపేస్తా.. అమెరికాతో మాట్లాడతా: ఉత్తరకొరియా కిమ్
ప్యాంగ్యాంగ్: ప్రపంచ చరిత్రలో ఇదొక అసాధారణ పరిణామం. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నూతన చరిత్ర లిఖించేందుకు సిద్ధమైపోయాడు. దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కనబెట్టి పొరుగుదేశం దక్షిణ కొరియాతో చర్చలకు రెడీ అన్నాడు. దీంతో ఉత్తర, దక్షిణ కొరియాలు మళ్లీ ఒక్కటయ్యే దిశగా కీలక ముందుడుగు పడింది.
మంగళవారం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్తో దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. తొలి దశలో కిమ్తో చర్చించేందుకు దక్షిణ కొరియా నేషనల్ సెక్యూరిటీ చీఫ్ చంగ్ యూ యాంగ్ తోపాటు మరో నలుగురు ప్రతినిధులను పంపగా.. వారితో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు అటు సియోల్ వర్గాలు కూడా వెల్లడించాయి.
రెండు దేశాల నడుమ దశాబ్దాలుగా...
ఉత్తర, దక్షిణ కొరియాల నడుమ దశాబ్దాలుగా నెలకొన్న శత్రుత్వానికి తెరపడింది. కొరియన్ వార్ తరువాత ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ కొరియావైపు నిలిచిన అమెరికా.. ఉత్తరకొరియాకు బద్ధ శత్రువుగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరుదేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ట్రంప్ బెదిరింపులకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఏమాత్రం బెదరలేదు సరికదా వరుస క్షిపణి పరీక్షలతో అమెరికానే కాకుండా ప్రపంచ దేశాలనే బెంబేలెత్తించాడు.
అమెరికా ఆంక్షల ఒత్తిడితో...
ఉత్తరకొరియాను లొంగదీసుకోవడానికి అమెరికా రకరకాలుగా ప్రయత్నించింది. ఐక్యరాజ్య సమితిచే ఆంక్షలు విధించేలా చూసింది. చివరికి కిమ్ జోంగ్ ఉన్ను తుదముట్టించేందుకు కూడా ప్రయత్నాలు చేసింది. ఏది ఏమైనాగానీ చివరికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లో గొప్ప మార్పు చోటుచేసుకుంది. తమపై అమెరికా పైచేయి కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో కిమ్ దక్షిణ కొరియావైపు స్నేహ హస్తం అందించాడు. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్కు తన దేశం నుంచి క్రీడాకారులను పంపించడమేకాక, తన సోదరి, ప్రేయసి.. ఇరువురినీ దక్షిణ కొరియాకు పంపించాడు. ప్రస్తుతం పొరుగు దేశంతో మైత్రికి చేయి చాపుతున్నట్లు కిమ్ జోంగ్ ఉన్ పేరిట ప్యాంగ్ యాంగ్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.
దశాబ్దం తరువాత మళ్లీ...
2007లో చివరిసారిగా అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు రో మూ హ్యూన్... ఇప్పటి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ 2తో కలిసి సదస్సు నిర్వహించారు. ఆ తరువాత 2011లో కిమ్ జోంగ్ ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడు అయ్యాక ఇప్పుడు 2018లో మళ్లీ దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులతో సమావేశం అయ్యారు. ఇన్నాళ్లూ పగ, ప్రతీకారంతో వ్యవహరించిన కిమ్ తొలిసారిగా దశాబ్దం తరువాత దక్షిణ కొరియావైపు స్నేహ హస్తం చాపారు. ఆ మధ్య ఇరు దేశాల చర్చల ప్రస్తావన రాగా.. కిమ్ను అంత తేలికగా నమ్మకూడదంటూ దక్షిణ కొరియాకు సలహా ఇచ్చింది అమెరికా. తాజాగా మంగళవారం జరిగిన చర్చలతో అన్ని అనుమానాలకు తెరపడింది.
అణు పరీక్షలకు స్వస్తి, చర్చలకే మొగ్గు...
దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులతో జరిగిన చర్చల్లో.. ఇక అణు పరీక్షలు నిర్వహించబోనని, దక్షిణ కొరియాతో చర్చలు కొనసాగిస్తానని, అవసరమైతే అమెరికాతో కూడా చర్చలకు సిద్ధమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హామీ ఇచ్చినట్లు దక్షిణ కొరియా నేషనల్ సెక్యూరిటీ చీఫ్ చంగ్ యూ యాంగ్ వెల్లడించారు. అంతేకాదు, దశాబ్దం తర్వాత రెండు కొరియాలు కలిసి వచ్చే నెలలో ఓ సదస్సు నిర్వహించడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేని ముఖాముఖీ కలుస్తానని కూడా కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. ఈ ఉమ్మడి సదస్సు దక్షిణ కొరియాలోని పాన్మున్జామ్ పీస్ హౌస్లో జరపాలని నిర్ణయించారు. ఇక రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడుకునేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.