ఒకేరోజు 3 క్షిపణి ప్రయోగాలు: ఉ.కొరియా మళ్లీ తెగించింది, అమెరికా ఏం చెప్పిందంటే?
అమెరికన్ మిలటరీ మాత్రం ఈ మూడు ప్రయోగాలు విఫలమయ్యాయని పేర్కొనడం గమనార్హం.
వాషింగ్టన్: ఇప్పటికే 11క్షిపణులను ప్రయోగించిన ఉత్తరకొరియా.. ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఒకే రోజు మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి తన వైఖరిని చాటుకుంది. అమెరికాతో యుద్దానికి కాలు దువ్వేందుకు దుస్సాహాసానికి ఒడిగడుతున్న ఉత్తరకొరియా చర్యలు అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగాలపై అమెరికా మిలిటరీ స్పందించింది. ఒకేరోజు ఆ దేశం చేపట్టిన మూడు క్షిపణి ప్రయోగాలు విఫలమైనట్లుగా వెల్లడించింది. కొరియన్ పెనిన్సులాకు తూర్పు దిశగా ఉన్న సముద్రంలోకి క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది.
తొలి రెండు క్షిపణులు విఫలమైపోగా.. మూడో క్షిపణి కొద్ది క్షణాల్లోనే పేలిపోయిందని పేర్కొంది. తాజా ప్రయోగాలన్ని గువాంను లక్ష్యంగా చేసుకున్నవి కాదని అమెరికా మిలటరీ వెల్లడించడం గమనార్హం. ఉత్తరకొరియా చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వివరించినట్లు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు.
ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!
గత జులై నెలలో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే క్షిపణి ప్రయోగం చేపట్టి.. ఆ దేశానికి ఉత్తరకొరియా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఘాటుగా స్పందించడంతో ఇరు దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. గువాం ద్వీపాన్ని పేల్చేస్తామంటూ ఉత్తరకొరియా చేసిన హెచ్చరికతో ఇది తారాస్థాయికి చేరుకుంది.
ఐరాస ఒత్తిడి నేపథ్యంలో ఉత్తరకొరియా ఎగమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో.. ఆర్థిక ఒత్తిడికి లోనైన ఆ దేశం.. యుద్దం ఆలోచనను తాత్కాళికంగా పక్కనపెట్టింది. ఉత్తరకొరియా మిత్రదేశం చైనాను కట్టడి చేయడం ద్వారా ఐరాస ఈ విషయంలో సఫలమైంది.