అమెరికాపై కరోనా బాంబు పేల్చిన కిమ్.. ‘చావు’పై సారీ చెప్పిన శత్రువులు.. ట్రంప్ అనూహ్య కామెంట్లు
ఉత్తరకొరియా లాంటి అతికొద్ది దేశాలు మినహా ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ విలయతాండం చేస్తూనేఉంది. ఇప్పటికే గ్లోబల్గా పాజిటివ్ కేసుల సంఖ్య 36లక్షలు, మరణాల సంఖ్య 2.5లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో కేసులు 12లక్షలకు, మరణాలు 70వేలకు పెరిగాయి. ఇంతటి విలయకాలంలోనూ అమెరికా కుట్రలు ఆపడంలేదని ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మండిపడ్డారు. అమెరికా, సౌత్ కొరియాలు ఉద్దేశపూర్వకంగా ఉ.కొరియాలోకి కరోనా వైరస్ ను పంపుతున్నారంటూ బాంబు పేల్చారాయన.
కిమ్ కొత్త థియరీ..
దాదాపు మూడు వారాలపాటు ప్రపంచానికి కనిపించకుండా గడిపిన కిమ్ జాంగ్ ఉన్.. సడెన్ గా నాలుగురోజుల కిందట ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోన్న దేశాన్ని గాడిలో పెట్టేందుకు రకరకాల విధానాలు రూపొందిస్తోన్న ఆయన.. తన ప్రయత్నాలకు అమెరికా, సౌత్ కొరియాలు అడ్డం పడుతున్నాయని ఆరోపించారు. తమ దేశంలోకి దిగుమతి అవుతోన్న వస్తువుల్లో వైరస్ ను జొప్పించి వదులుతున్నారని కొత్త థియరీ ప్రచారంలోకి తెచ్చారు. ఈ మేరకు దేశంలో పలు చోట్ల జరుగుతోన్న కీలక డిబేట్ల వివరాలను ఉత్తరకొరియా మీడియా ప్రచురించింది.
అనుమానిత వస్తువులు..
ఉత్తరకొరియాలోకి దిగుమతి అవుతోన్న వస్తువులపై కరోనా వైరస్ ను స్ప్రేచేసి పంపుతున్నారని, దేశాన్ని దెబ్బతీయడానికే అమెరికా, నార్త్ కొరియాలు ఈ కుట్రకు తెరతీశాయని నార్త్ కొరియా ఆరోపించింది. అంతేకాదు, సౌత్ సరిహద్దు గ్రామాల్లోకి అనుమానిత వస్తువులు వచ్చిపడుతున్నాయన్న స్థానిక అధికారులు.. ప్రజలెవరూ అలాంటి వస్తువుల్ని తాకరాదని, వెంటనే బాధ్యులకు సమాచారం అందించాలని సూచించారు. రాజధాని ప్యోంగ్యాంగ్ సహా పలు పట్టణాల్లో దీనిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
సారీ చెప్పిన డిఫెక్టర్లు..
గుండె ఆపరేషన్ వికటించడంతో కిమ్ జాంగ్ మరణించాడని, దానికి 99 శాతం గ్యారంటీ కూడా ఇస్తామని ప్రకటనలు చేసిన ఇద్దరు ప్రముఖులు ప్రపంచ మీడియాకు, ఉత్తరకొరియాకు క్షమాపణలు చెప్పారు. ఒకప్పుడు కిమ్ జాంగ్ సన్నిహితులుగా ఉండి, వర్కర్స్ పార్టీలో కీలక నేతలుగా పనిచేసి, కాలక్రమంలో అక్కణ్నుంచి పారిపోయివచ్చేసిన జీ షెయాంగ్ హో, తాయ్ యాంగ్ హో ఈ మేరకు సోమవారం ప్రకటనలు చేశారు. జీ షెయాంగ్ హో ప్రస్తుతం సౌత్ కొరియా జాతీయ అసెంబ్లీ మెంబర్ గానూ ఉండటంతో ఆయన ప్రకటనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, తప్పుడు సమాచారం వల్లే కిమ్ చనిపోయారని చెప్పాల్సి వచ్చిందని, బాధ్యతగల వ్యక్తిగా తప్పును గుర్తించి, క్షమాపణలు చెబుతున్నానని షెయాంగ్ అన్నారు.
Recommended Video
అమెరికాలో మరణాలపై ట్రంప్..
కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోన్న అమెరికాలో మరణాలు 2 లక్షలు దాటొచ్చని తొలుత అంచనాలు వచ్చాయి. అయితే వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్న ప్రెసిడెంట్ ట్రంప్ మరణాలు తగ్గొచ్చని గతంలో అంచనా వేశారు. మళ్లీ సోమవారం నాటికి మాటమార్చేశారు. "ఈ కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో కనీసం 1 లక్ష పౌరులను కోల్పోతామనిపిస్తోంది. తలుచుకుంటేనే భయమేస్తోంది" అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో ఆయన తన అభిప్రాయాలు మార్చుకున్నట్టు తెలుస్తోంది.