అన్నంత పని చేస్తున్న కిమ్?: లీకైన ఫోటోలతో అమెరికా బెంబేలు, ఉ.కొరియా మీడియా మరోలా!
ఉత్తరకొరియా సైనికాధికారులతో గువాం శాటిలైట్ ఫోటోలను వీక్షిస్తూ కిమ్ స్కెచ్ వేశారని చెబుతున్నారు.
వాషింగ్టన్: యుద్దానికి కాలు దువ్వుతూ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అన్నంత పని చేసేలా ఉన్నారు. ఉత్తరకొరియాను అదుపులో ఉండాలన్న ట్రంప్ వ్యాఖ్యలు ఆ దేశాన్ని మరింత రెచ్చగొట్టాయి.
ఉ.కొరియా వెనుక ఆ దేశం: అమెరికాకు ఊహించని షాక్?, ద్వంద్య నీతికి పరాకాష్ఠ!
అమెరికా ఆధీనంలోని గువాం ద్వీపంపై దాడి చేస్తామని, అవసరమైతే ఆ దేశ భూభాగంపై కూడా దాడులు తప్పవని ఉత్తరకొరియా ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగుచూసిన కిమ్ జాంగ్ ఫోటోలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.
లీకైన ఫోటోలు:
గువాం ద్వీపం శాటిలైట్ చిత్రాలను వీక్షిస్తూ కిమ్ జాంగ్ ఏదో స్కెచ్ వేస్తున్నట్లుగా తాజాగా కొన్ని ఫోటోలు లీకయ్యాయి. ఇందులో జపాన్ మీదుగా గువామ్ వరకు కిమ్ ఓ రేఖను గీసినట్లు తెలుస్తోంది. గువాంపై దాడికి మార్గదర్శకాలు ఇస్తూ కిమ్ ఈ సూచన చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Recommended Video
నాలుగు క్షిపణులతో దాడికి ప్లాన్?:
గువాం ద్వీపంపై నాలుగు క్షిపణులతో దాడి చేయాలని భావించిన ఉత్తరకొరియా.. చివరి క్షణంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొరియన్ ద్వీపకల్పంలో అమెరికా కదలికలు మితిమీరడంతో.. ఆ దేశ వైఖరిలో ఏమాత్రం మార్పు వచ్చినా దాడి చేయాలని కిమ్ ప్లాన్ వేసినట్లుగా అమెరికా అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
అమెరికాలో తీవ్ర ఆందోళన:
తాజాగా లీకైన ఫోటోలో గువామ్లోని అండర్సన్ ఎయిర్ఫోర్స్ బేస్ శాటిలైట్ చిత్రం పక్కన కిమ్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ బేస్ను కిమ్ టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. నియంతలా వ్యవహరించే కిమ్ జాంగ్.. అమెరికా విషయంలోను ప్రపంచ దేశాల మాటలను పట్టించుకోవడం లేదు. దీంతో తమ దేశంపై ఉత్తరకొరియా ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందోనన్న ఆందోళన అమెరికాలో తీవ్రమైంది.
ఉత్తరకొరియా మీడియా మరోలా:
గువాం ద్వీపంపై ఇప్పట్లో దాడి చేసే అవకాశాలు లేవని ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) పేర్కొంది. గువాం ద్వీపంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్న కిమ్ ఫోటోలు లీకైన తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.
గువాం ద్వీపంపై దాడి చేయాలన్న ఆలోచనను ప్రస్తుతానికి కిమ్ విరమించుకున్నారని కేసీఎన్ఏ తెలిపింది. అయితే దాడుల కోసం పథక రచన చేసింది నిజమేనని, కానీ ఇప్పటికిప్పుడు గువాం ద్వీపంపై దాడి చేసే ఉద్దేశం ఆయనకు లేదని ఆ మీడియా పేర్కొంది.
చైనా ఆంక్షలతో దిగి వచ్చిందా?:
ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు అంతే దుందుడుకుగా వ్యవహరించడం పట్ల ఇటు అమెరికాకు ఐరాస నుంచి ఒత్తిడి తప్పలేదు. మధ్యలో జోక్యం చేసుకున్న చైనా సైతం.. తొలి బాంబు ఉత్తరకొరియా వేస్తే జోక్యం చేసుకోమంటూ పేర్కొనడం యుద్ద వాతావారణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినట్లయింది. దీంతో చైనా తీరుపై ఐరాస మండిపడింది. ఐరాస ఒత్తిడితో చైనా ఉత్తరకొరియాను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తమ దేశం నుంచి ఉత్తరకొరియాకు జరగాల్సిన ఎగుమతులు, దిగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఈ దెబ్బతో ఉత్తరకొరియా యుద్దం ఆలోచన మానేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.