ఉత్తరకొరియాలో కంపించిన భూమి, మరో అణుపరీక్ష!? అది హైడ్రోజన్ బాంబు ఎఫెక్టా? ఇక యుద్ధం తప్పదా?
ఉత్తర కొరియాలో ఈ ఉదయం 3.4 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. అయితే ఇది సాధారణ భూకంపమా? లేక ఉత్తర కొరియా మరో అణుపరీక్షను నిర్వహించిందా? అనే అనుమానం తలెత్తింది.
బీజింగ్: ఉత్తర కొరియాలో ఈ ఉదయం 3.4 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. అయితే ఇది సాధారణ భూకంపమా? లేక ఉత్తర కొరియా మరో అణుపరీక్షను నిర్వహించిందా? అనే అనుమానం తలెత్తింది.
చైనా భూకంప విభాగం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. భారీ విస్ఫోటనం వల్ల ఈ ప్రకంపనలు వచ్చి ఉండవచ్చని అనుమానించింది. సెప్టెంబర్ 3న కూడా ఉత్తర కొరియా శక్తిమంతమైన అణుప్రయోగం జరిపింది. అప్పుడు కూడా ఇలాంటి ప్రకంపనలే వచ్చాయని చైనా అధికారులు తెలిపారు.
అది హైడ్రోజన్ బాంబు ఎఫెక్టేనా?
పసిఫిక్ మహాసముద్రంపై హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తామంటూ నిన్న ఉత్తరకొరియా ప్రకటించింది. దీంతో, శనివారంనాటి భూప్రకంపనలపై ప్రపంచ దేశాలన్నీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరకొరియా చెప్పినట్లుగానే హైడ్రోజన్ బాంబును పరీక్షించిందేమో అనేది అన్ని దేశాల అనుమానం.
ఈ దఫా సముద్రంలో పరీక్షా?
ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును ఈ దఫా సముద్రంలో పరీక్షించనుందనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఉత్తరకొరియా ఆరుసార్లు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది. ఇవన్నీ ఉత్తరకొరియాలోని భూగర్భంలోనే జరిపారు. తాజాగా పసిఫిక్ సముద్రంలో పరీక్షించనున్నట్టు సమాచారం. దీంతో జపాన్తో పాటు అమెరికా ఎలా స్పందిస్తాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
క్షిపణులకు అణువార్హెడ్లు బిగించి ప్రయోగిస్తే...?
గత కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవేళ ఉత్తర కొరియా అణువార్హెడ్లను బిగించిన క్షిపణులను ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తే ఉత్తర కొరియాపై అమెరికా దాడికి దిగే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా మీదికే ఎక్కుపెడుతుందా?
ఈ ప్రయోగం ద్వారా అమెరికాలోని పలు ప్రాంతాలపై తమ క్షిపణులతో దాడి చేసే అవకాశముందన్న హెచ్చరికను ఉత్తరకొరియా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా ప్రయోగం జరిపితే అంతర్జాతీయంగా తీవ్రనిరసన వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచదేశాలు ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ఏకమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని వారు తెలిపారు.
విఫలమై.. జపాన్ లో పడితే...
అణువార్హెడ్లను మోసుకెళ్లగల ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం ఒకవేళ విఫలమైతే అది జపాన్లో పడే ప్రమాదముందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఇలా గనుక జరిగితే.. జపాన్ రక్షణ బాధ్యతలను చూస్తున్న అమెరికా ఈ ఘటనతో తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశముందని, దీంతో కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని చెబుతున్నారు.
ఉద్రిక్తత తగ్గుముఖం పట్టాలి...
సమస్యకు పరిష్కారంగా ఉత్తర కొరియా జపాన్ గగనతలం మీదుగా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించకూడదని, అదే సమయంలో అమెరికా సైతం దక్షిణ కొరియాలో తన యుద్ధ విమానాలను మోహరించడం మానివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమస్యను తీవ్రతరం చేయకుండా అమెరికా, ఉత్తర కొరియా నేతలు సంయమనం పాటించాలని వారు కోరారు.
ఆంక్షల బాటలో చైనా...
క్షిపణి ప్రయోగాలు, అణుపరీక్షలతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పుతున్న ఉత్తరకొరియాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఐరాస భద్రతామండలిలో తీర్మానం ఆమోదించింది. ఈ నేపథ్యంలో చైనా కూడా ఆ దేశంపై సరికొత్త ఆంక్షలు విధించింది. ఉత్తరకొరియాకు చమురు సరఫరాలో కోత విధించాలని నిర్ణయించింది.
ఉత్తరకొరియాకు ఎదురుదెబ్బే...
శుద్ధిచేసిన పెట్రోలియం ఎగుమతులను ఏడాదికి 2 మిలియన్ బ్యారెల్స్కు పరిమితం చేసినట్లు చైనా పేర్కొంది. మరోపక్క ఉత్తరకొరియాకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అమ్మకాలను నిలిపివేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు చైనా వాణిజ్యమంత్రి వెల్లడించారు. అంతేగాక.. ఉత్తరకొరియా నుంచి వస్త్ర దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ డ్రాగన్ నిర్ణయం తీసుకుంది. చైనా తాజా నిర్ణయంతో ఉత్తరకొరియాకు ఎదురుదెబ్బ తగిలినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.