అణుపరీక్ష కేంద్రాన్ని పేల్చేశాక కిమ్ జాంగ్కు ట్రంప్ షాక్: భేటీ రద్దు.. ఎప్పుడైనా: ఉత్తర కొరియా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో ఎప్పుడైనా చర్చలకు తాము సిద్ధమని ఉత్తర కొరియా ప్రకటించింది. ట్రంప్ - కిమ్ జాంగ్ ఉన్ల భేటీ కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. ఈ భేటీ అంశం మలుపులు తిరుగుతోంది. అమెరికా - ఉత్తర కొరియా అధ్యక్షుల భేటీ రద్దయింది.
కిమ్ జోంగ్ ఉన్తో తాను భేటీ కావడం లేదని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ నిర్ణయంపై ఉత్తర కొరియా విచారం వ్యక్తం చేసింది. ఇంత జరిగినప్పటికీ తాము అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించంది. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.
డొనాల్డ్ ట్రంప్ సమావేశాన్ని రద్దు చేస్తారని మేం ఊహించలేదని, ఇది చాలా విచారకరమని ఉత్తర కొరియా మంత్రి కిమ్ కై గ్వాన్ చెప్పినట్లు కేసీఎన్ఏ పేర్కొంది. కిమ్ జాంగ్ ఉన్ కూడా స్పందించారని తెలుస్తోంది. సమస్యల పరిష్కారం కోసం మేం ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.
ఇద్దరు నేతల మధ్య జూన్ 12న సింగపూర్లో భేటీ జరగవలసి ఉంది. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు కిమ్కు లేఖ కూడా పంపించారు.
మీతో భేటీ అవ్వడానికి నేను ఆస్తక్తిగా ఎదురు చూశానని, కానీ, దురదృష్టవశాత్తూ ఇటీవల మీరు చేసిన ప్రకటనల్లో అమెరికాపై ఎంతో ద్వేషం, శత్రుత్వ వైఖరిని ప్రదర్శించారని, ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ భేటీ అనవసరం అనిపించిందని ట్రంప్ ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. ఉత్తర కొరియాలో అణు పరీక్షా కేంద్రాన్ని పేల్చేసిన కొద్ది గంటలకే ట్రంప్ సమావేశాన్ని రద్దు చేయడం గమనార్హం.