ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు: వైరస్ లక్షణాలతో: నియంత కిమ్జొంగ్ ఏం చేశాడో తెలుసా?
ప్యాంగ్యాంగ్: ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ఇప్పటిదాకా 200లకు పైగా దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని బలి తీసుకుంది. కోటిన్నర మందికి పై కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారిన పడని దేశమంటూ ఏదీ లేదు.. ఒక్క ఉత్తర కొరియా తప్ప. ఉత్తర కొరియాలో కరోనా పాజిటివ్ కేసులు ఇదివరకే నమోదైనప్పటికీ.. నియంత పాలనలో ఉన్న ఆ దేశం ఆ సమాచారాన్ని దాచి పెట్టిందనే వార్తలు ఇదివరకు వెలువడ్డాయి. ఎప్పుడూ కరోనా కేసుల జాబితాలో ఉత్తర కొరియా చేరలేదు.
Recommended Video
కరోనా లక్షణాలతో కొరియన్..
తాజాగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఉత్తర కొరియాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. జ్వరం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న అతను ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలను నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఉత్తర కొరియా నియంత కిమ్జొంగ్ ఉన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. గరిష్ఠస్థాయి అత్యవసర పరిస్థితిని విధించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అత్యవసర పరిస్థితిని విధించారు.
పొలిట్బ్యురో సమావేశంలో
ఆదివారం నుంచి ఉత్తర కొరియాలో మ్యాగ్జిమమ్ ఎమర్జెన్సీ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే కిమ్జొంగ్ యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. తాను సారథ్యాన్ని వహిస్తోన్న వర్కర్స్ పార్టీ ప్రతినిధులతో అత్యవసరంగా పొలిట్బ్యురో సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తి నివసిస్తోన్న కయీసంగ్ నగరాన్ని సీల్డౌన్ చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో అత్యవసర పరిస్థితిని విధించినట్లు వెల్లడించారు. అత్యంత కఠినంగా అత్యవసర పరిస్థితులను నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పార్టీ సెంట్రల్ కమిటీ నేతలు, పొలిట్బ్యూరో సభ్యులను ఆదేశించారు.
అక్రమంగా ఉత్తర కొరియాలోకి
కరోనా వైరస్ బారిన పడ్డ ఆ వ్యక్తి మూడేళ్లుగా దక్షిణ కొరియాలో నివసిస్తున్నాడు. ఈ నెల 19వ తేదీన అక్రమంగా సరిహద్దులను దాటుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. దక్షిణ కొరియా సరిహద్దులకు ఆనుకునే ఉంటుంది ఈ కయీసాంగ్ నగరం. ఆ నగరంలో పరిశ్రమలు అధికం. ఉత్తర కొరియాలోకి ప్రవేశించిన ఈ అయిదు రోజుల వ్యవధిలో అతను ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడు? అతని కుటుంబ సభ్యులు ఎవరు? అనే విషయాన్ని వెంటనే ఆరా తీయాలని, దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కిమజొంగ్ ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది.
ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ చేసేలా..
కియాంగ్ నగరంలో అనుమానిత కరోనా వైరస్ సోకిన వ్యక్తి తిరుగాడిన ప్రదేశాల్లో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలను చేయడం, వారిని క్వారంటైన్కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కిమ్జొంగ్ ఆదేశాలను జారీ చేసినట్లు కేసీఎన్ఏ పేర్కొంది. రష్యా నుంచి ఉత్తర కొరియా ఆ దేశం నుంచి వేల సంఖ్యలో కరోనా వైరస్ కిట్లను ఇదివరకే తెప్పించుకుంది. కొన్ని పొరుగు దేశాల నుంచీ కిట్లను కొనుగోలు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ సెంటర్లను నెలకొల్పింది. సరిహద్దులను మూసివేసింది. సరిహద్దు నగరాల్లో కఠిన ఆంక్షలను విధించింది. కొద్దిరోజుల కిందటే ఈ ఆంక్షలను సడలించింది.
సరిహద్దులపై నిఘా
తాజా ఘటనతో సరిహద్దులను మరోసారి మూసివేయొచ్చని తెలుస్తోంది. దక్షిణ కొరియా నుంచి అక్రమంగా సరిహద్దులను దాటుకుని వచ్చిన ఉదంతంపై కిమ్జొంగ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దీనికోసం ఆర్మీ అధికారులతో ఓ కమిటీని వేశారు. తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై కూపీ లాగుతున్నారు. అక్రమంగా ప్రవేశించడానికి కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని కిమ్జొంగ్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వ్యాప్తి చెందకూడదని కఠిన ఆదేశాలను జారీ చేసినట్లు కేసీఎన్ఏ పేర్కొంది.