ఆ భయంతోనే అజ్ఞాతంలోకి.. కిమ్ అదృశ్యంపై సౌత్ కొరియా కీలక అప్డేట్.. నిజమైతే నవ్వులపాలే!
కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో బహుశా ఏ దేశాధినేత వార్తల చుట్టూ ఇంత క్యురియాసిటీ నెలకొని ఉండదు. కిమ్ వార్నింగ్ ఇచ్చినా సంచలనమే.. సైలెంట్గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా సంచలనమే. వయసు రీత్యా చిన్నవాడు.. ఓ చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ.. అరాచకంలో అతనితో పోల్చదగ్గ సమకాలీన నాయకుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. అతని ఉన్మాదపు పాలన,నియంతృత్వ పోకడలు ఉత్తర కొరియాను ఓ మిస్టరీ దేశంగా మార్చేయడంతో.. ఆ దేశం గురించి,కిమ్ వ్యవహారాల గురించి ఏ చిన్న వార్త బయటకు పొక్కినా.. అది సంచలనంగా మారిపోతోంది. గత కొద్దిరోజులుగా కిమ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో.. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.
Recommended Video
సౌత్ కొరియా ఇచ్చిన తాజా అప్డేట్..
కరోనా వైరస్ భయాందోళనతోనే కిమ్ జోంగ్ ఉన్ ఏప్రిల్ 15 నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి ఉండవచ్చునని ఉత్తర కొరియా వ్యవహారాలకు సంబంధించిన దక్షిణ కొరియా మంత్రి తాజాగా అభిప్రాయపడ్డారు. కిమ్కి ఏదో అయిపోయిందని.. అతను మరణం అంచుల్లో ఉన్నాడని సర్వత్రా ప్రపంచం జరుగుతున్న వేళ.. అసలు ఉత్తర కొరియాలో అలాంటి ఛాయలేవి కనిపించట్లేదన్నారు. కిమ్కి ఏదైనా జరిగితే కచ్చితంగా ఆ దేశంలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకుని ఉండేవని.. కానీ అవేవీ కనిపించట్లేదని నొక్కి చెప్పారు.
అజ్ఞాతంలోకి వెళ్లడం ఇదేమీ కొత్త కాదు..
కిమ్ ఇలా కనిపించకపోవడం కూడా ఇదేమీ కొత్త కాదని ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే కిమ్ యోన్-చుల్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు దాదాపుగా 20 రోజుల పాటు కనిపించకుండా పోయారని చెప్పారు. కాబట్టి ఇదేదో అసాధరణ పరిణామం అని తాము భావించట్లేదన్నారు. నార్త్ కొరియాలో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదన్న విషయంపై స్పందిస్తూ.. అక్కడ వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
దేశాధినేతల్లోనూ ఆశ్చర్యం..
కిమ్ అదృశ్యంపై అందరు దేశాధినేతల్లోనూ ఒకింత ఆశ్చర్యం నెలకొంది. జపాన్ ప్రధాని షింజో అబే.. కిమ్ అదృశ్యానికి సంబంధించిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్ ఆరోగ్యంగానే ఉండి ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే కిమ్ ఎక్కడున్నాడన్న దానిపై ట్రంప్కు కూడా కచ్చితమైన సమాచారం ఉండకపోవచ్చునని తెలుస్తోంది.
అదే నిజమైతే.. నవ్వులపాలే..
కరోనా సోకకుండా ఉండేందుకే కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారన్న వార్తలపై కొరియా రిస్క్ గ్రూప్ సీఈవో ఓ కరోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే స్థానిక మీడియా నవ్వుల పాలవుతుందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లడం విమర్శలకు తావిస్తుందన్నారు. అంతేకాదు,ఒకవేళ కరోనా బారిన పడకుండా ఉండేందుకే కిమ్ రహస్య ప్రదేశంలో తలదాచుకుని ఉంటే.. ఆయన ఫోటోలు,వీడియోలు విడుదల చేయవచ్చు కదా అన్నారు. తద్వారా ఆయన అనారోగ్యంతో ఉన్నారన్న వార్తలకు చెక్ పెట్టవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కరోనా విజృంభిస్తున్న వేళ.. కిమ్ అదృశ్యం.. వైరస్ కంటే ఎక్కువ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.