మినీ న్యూక్లియర్ హెడ్స్ ఉంది: కొరియా చీఫ్ హెచ్చరిక
కొరియా: తమ శాస్త్రవేత్తలు మినీ న్యూక్లియర్ వార్ హెడ్లను తయారు చేశారని, వాటిని బాలిస్టిక్ మిసైళ్ల మీద కూడా అమర్చగలమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న ప్రకటంచారు. గతంలో ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ ఈ విషయం చెప్పినప్పటికీ.. అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడం ఇది మొదటిసారి.
కొరియా అణ్వస్త్ర బలాన్ని మరింత పెంచుకునేందుకు అణు శాస్త్రవేత్తలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల వారి కేంద్రానికి వెళ్లారు. అప్పుడు ఆయన ఈ విషయం చెప్పారని తెలుస్తోంది.
అణు వార్ హెడ్లతో కూడిన వివిధ రకాల వ్యూహాత్మక బాలిస్టిక్ మిసైళ్ల రూపకల్పన పైన పరిశోధనలు సాగించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. అణ్వస్త్రాల తయారీ, రాకెట్ పరీక్షల మీద ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినప్పటి నుంచి ఉత్తర కొరియా మరింత దూకుడు పెంచింది.
థర్మో-న్యూక్లియర్ వార్హెడ్స్ను తమ శాస్త్రవేత్తలు విజయవంతంగా సూక్ష్మరూపంలోకి మార్చారని కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించారు. వీటిని బాలిస్టిక్ క్షిపణుల ద్వారా ప్రయోగించగలమని, శత్రువులను అడ్డుకోవడానికి ఇది తోడ్పడుతుందని కిమ్ పేర్కొన్నారు.
కాగా, అమెరికాను బూడిద కుప్పగా మార్చేస్తామని, మంటల్లోకి నెట్టేస్తామని ఉత్తర కొరియా ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా పైన, ఈశాన్య ఆసియాలోని దాని సైనిక స్థావరాల పైనా అణ్వాయుధ దాడులు చేస్తామని సోమవారం నాడు హెచ్చరించింది.
అమెరికా, దక్షిణ కొరియా ఏటా నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా దాడులు చేస్తే తిప్పికొట్టగల సామర్థ్యం ఉందో లేదో పరీక్షించుకునేందుకు ఈ విన్యాసాలు దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని ఉత్తర కొరియా ఆరోపించింది.