బాంబు పేల్చిన ఉత్తర కొరియా నియంత: జో బిడెన్కు వార్నింగ్: అణ్వాయుధాలు రెట్టింపు అందుకే
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత, ఆధునిక నియంత కిమ్జొంగ్ ఉన్.. మరోసారి అణ్వాయుధాల ప్రస్తావనను తీసుకొచ్చారు. దేశ అణ్వస్త్ర సామార్థ్యాన్ని రెట్టింపు చేస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఏర్పడే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనడానికి అణ్వాయుధాలను మరింత సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవడానికీ వెనుకాడబోవట్లేదని అన్నారు. తమ దేశానికి అణ్శాయుధాలే రక్షణగా నిలుస్తాయని ఆయన చెప్పారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవడం వల్ల మరొకరు తమను వేలెత్తి చూపబోరని అన్నారు.
అమరావతి సినిమా స్టైల్లో హత్య: మహిళకు మరణశిక్షఎలా అమలు చేశారంటే: 70 ఏళ్ల తరువాత
రాజధాని ప్యాంగ్యాంగ్లో కొనసాగుతోన్న అధికార వర్కర్స్ పార్టీ మహాసభ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి కిమ్జొంగ్ ప్రసంగించారు. ఈ మహాసభల సందర్భంగా ఆయన అధికార పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కిమ్ తొలిసారిగా నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. అణ్వస్త్ర సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి అవసరమైన ఆదేశాలను తక్షణమే జారీ చేస్తానని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత.. అణ్వాయుధ శక్తిని పెంపొందించుకోవడంపై ప్రాధాన్యత ఇచ్చానని, అదే విధానాన్ని కొనసాగిస్తానని అన్నారు.
ఈ తొమ్మిదేళ్ల కాలంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. అంచనాలకు అనుగుణంగా పాలన సాగుతోందని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన అంగీకరించారు. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి, మళ్లీ పూర్వపు స్థితికి తీసుకుని రావడానికి తక్షణ చర్యలను సూచించాల్సిందిగా ఆయన పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా ఆంక్షలను విధించడం కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందని అన్నారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై కొన్ని విమర్శలను సంధించారు.
అమెరికాలో ప్రభుత్వం మారబోతోందని, కొత్త ప్రభుత్వం తమ దేశం పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే విషయం కొరియన్లలో ఆసక్తి కలిగిస్తోందని కిమ్జొంగ్ వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాపై నిప్పులు చెరిగారు. తమదేశంలో ఎలాంటి సైనిక కార్యక్రమాలను చేపట్టినప్పటికీ.. పొరుగు దేశం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. తమతో కయ్యానిక దిగేలా దక్షిణ కొరియా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమతో సామరస్యంగా ఉన్నంత వరకూ తాము స్నేహంగానే ఉంటామని, ఎదురు తిరిగితే ఎలాంటి వారైనా ఉపేక్షించేది ఉండదని కిమ్జొంగ్ పరోక్షంగా హెచ్చరిక సంకేతాలను పంపించారు.