క్షిపణి ప్రయోగం ద్వారా దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్: ఉత్తరకొరియా మీడియా
సియోల్ : ఉత్తరకొరియా రెండు షార్ట్ రేంజ్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. తూర్పు సముద్రంగా పిలువబడే జపాన్ సముద్రంలోకి ఈ క్షిపణలు చొచ్చుకెళ్లాయి. అయితే ఇది దక్షిణ కొరియాకు హెచ్చరించే ఉద్దేశంతోనే క్షిపణి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోనే ఈ క్షిపణి ప్రయోగాలు జరగడం...తానే వ్యక్తిగతంగా దీన్ని సమీక్షించడం చేశారని ఆదేశ ప్రభుత్వ మీడియా కొరియన్ సెంట్రల్ ఏజెన్సీ కథనం ప్రసారం చేసింది. కేవలం దక్షిణ కొరియా మిలటరీని హెచ్చరించడం కోసమే ఈ ప్రయోగం జరిగిందని ఆ మీడియా సంస్థ పేర్కొంది.
అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్ ఆగ్రహం
క్షిపణ ప్రయోగం విజయవంతం అవడంపై తాను సంతృప్తితో ఉన్నట్లు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు. అయితే అణ్వాయుధాలను వీడాలంటూ అమెరికా ఉత్తరకొరియా దేశాల మధ్య జరుగుతున్నచర్చలకు ఈ క్షిపణి ప్రయోగం ప్రతిష్టంభనగా మారే అవకాశం ఉంది. గత నెలలో కిమ్ ట్రంప్ల మధ్య భేటీ జరిగినప్పటికీ ... ఇకపై కూడా చర్చలు జరుగుతాయని ఇరుదేశాల అధినేతలు ప్రకటించారు. కానీ ఎప్పుడు జరుగుతాయనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని దక్షిణ కొరియా ప్రణాళిక ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు రుచించలేదని ఉత్తరకొరియా మీడియా పేర్కొంది.
అమెరికా నుంచి యుద్ధ విమానాల కొనుగోలు
ఇదిలా ఉంటే జూలై 16న ఎఫ్-35 యుద్ధ విమానాలు అమెరికా నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నట్లు దక్షిణకొరియా రక్షణశాఖ ప్రకటించింది.ఇప్పటికే దక్షిణ కొరియాలో ఈ తరహా యుద్ధ విమానాలు నాలుగు ఉండగా...2021 నాటికి 40 ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఒకవేళ ఈ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తే అవి ఉత్తరకొరియా రేడార్లను పసిగట్టి తద్వారా తమ దేశానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కిమ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు అమెరికా దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తే ఉత్తరకొరియా దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రమాదంలో పడుతాయని కిమ్ హెచ్చరించినట్లు కొరియన్ మీడియా తెలిపింది. అంతేకాదు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్కు కూడా ఈ క్షిపణి ప్రయోగాన్ని సీరియస్గా తీసుకోకుంటే భవిష్యత్తులో పరిణామాలు మరింత త్రీవంగా ఉంటాయని కిమ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న కిమ్
కొరియన్ పెనిన్సులా అభివృద్ధికి ఉత్తరకొరియా ఆటంకం కలగజేస్తోందని దక్షిణ కొరియా అభిప్రాయపడుతోంది. గురువారం రెండు క్షిపణి ప్రయోగాలు చేసిందని చెప్పిన దక్షిణ కొరియా.... ఉత్తరకొరియా తన ఆయుధాలను పెంపొందించుకునే పనిలో పడిందని ఆరోపించింది. ఉత్తర కొరియా ఆర్మీ మాత్రం చాలా తెలివిగా సమాధానం ఇస్తోంది. ట్రంప్ - కిమ్ చర్చల్లో భాగంగా అణ్వాయుధాలను, దీర్ఘలక్ష్యాలను చేధించగల క్షిపణుల ప్రయోగాలను నిలిపివేస్తామని మాత్రమే చెప్పామని... ఇతర ఆయుధాలు ప్రయోగించమని ఎక్కడా పేర్కొనలేదని చెబుతోంది. అయినప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తీర్మానాలను ఉత్తరకొరియా ఉల్లంఘించినట్లే అవుతుందని దక్షిణ కొరియా చెబుతోంది. అమెరికా నుంచి సమాచారం పొందిన తర్వాత భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేస్తామని దక్షిణకొరియా ప్రభుత్వం స్పష్టం చేసింది.