ట్రంప్ ఎఫెక్ట్: అణపరీక్షలు ఆపేస్తామంటూ కిమ్ సంచలనం, అందుకే, ‘మంచి నిర్ణయం’
సియోల్: వరుస అణు పరీక్షలతో ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేసిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. తాము అణు పరీక్షలను, లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలను నిలిపేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే తమ అణు పరీక్ష ప్రాంతాన్ని మూసేస్తున్నామని తెలిపింది.
అమెరికాతో అణు ప్రయోగాలపై చర్చలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లు సమావేశమయ్యేందుకు ఇరు దేశాల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు.
ట్రంప్ భేటీ ప్రభావమే..?
అణ్వస్త్రాలను నిలిపేయాలని అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అణుపరీక్షలను నిలిపేస్తున్నట్లు చెప్పిన ఉత్తర కొరియా ఇప్పటికే ఉన్న అణు ఆయుధసంపత్తి గురించి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అందుకు ఒప్పుకోకపోవచ్చు
కిమ్ అణు పరీక్షలను నిలిపేయడానికి అంగీకరించినప్పటికీ.. ఆయుధ సంపత్తిని తగ్గించేందుకు ఒప్పుకోకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఉత్తర కొరియా అణు ప్రయోగాలు నిలిపేస్తున్నట్లు చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
మంచి వార్తంటూ ట్రంప్
అణుపరీక్షలు నిలిపేయాలని తీసుకున్న నిర్ణయం ఉత్తర కొరియాకు, ప్రపంచానికి చాలా మంచి వార్త అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది చాలా పెద్ద పురోగతి దిశగా నడిపించే నిర్ణయమని అన్నారు. కిమ్తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
త్వరలో భేటీ.. అందుకే ఈ నిర్ణయం
మే లేదా జూన్లో ట్రంప్, కిమ్ల సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతున్నందున తమ దేశంపై అధికంగా ఉన్న ఆంక్షలను తొలగించుకోవాలని కిమ్ భావిస్తున్నారని దక్షిణ కొరియా, అమెరికా అధికారులు చెబుతుండటం గమనార్హం. ఉత్తరకొరియా తమ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుకు, మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అనుకుంటోందని పేర్కొన్నాయి.