అంతా ఏకపక్షంగా డిమాండ్: అమెరికాపై ఉత్తర కొరియా ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికాపై ఉత్తర కొరియా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా క్రూరమైన డిమాండ్లు చేస్తోందని ఆరోపించింది. కీలకమైన అణ్వస్త్ర నిరాయుధీకరణ అంశంపై ఇరు దేశాల చర్చల అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఉత్తర కొరియాలోని కీలక నేత కిమ్ యాంగ్ చోల్ల మధ్య రెండు రోజుల చర్చలు శనివారం ముగిశాయి. అమెరికా వ్యక్తపరిచిన డిమాండ్లు ఏకపక్షంగా ఉన్నాయని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మండిపడింది.
శిఖరాగ్ర సదస్సు స్ఫూర్తికి విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోందని, ఏకపక్షంగా అణ్వాయుధాలను వదిలి పెట్టాలని తమ దేశంపై ఒత్తిడి తెస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, సింగపూర్ సదస్సు తర్వాత ఉత్తర కొరియా నుంచి ఇక ఏమాత్రం అణుముప్పు లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఆ సదస్సులో ఉత్తర కొరియాకు భద్రతా భరోసాలు ఇస్తామని అమెరికా చెప్పింది. దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు నిలిపేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
అయితే సదస్సు అనంతరం ఉత్తర కొరియాపై ఆంక్షలను ట్రంప్ పునరుద్ధరించారు. అలాగే ఉత్తర కొరియా తన అణుక్షిపణి కార్యక్రమాల సదుపాయాలకు మెరుగులు దిద్దుతోందనేందుకు ఆధారాలు ఉన్నాయని అమెరికా నిఘా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అణు నిరాయుధీకరణ పట్ల ఉత్తర కొరియా నిబద్ధతను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా అమెరికా విదేశాంగ మంత్రి దక్షిణ కొరియాలో పర్యటించారు. ఆ తర్వాత ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.