అమెరికాను బూడిద చేస్తాం: ఉ.కొరియా గట్టి హెచ్చరిక
కొరియా: అమెరికాను బూడిద కుప్పగా మార్చేస్తామని, మంటల్లోకి నెట్టేస్తామని ఉత్తర కొరియా తాజాగా హెచ్చరించింది. అమెరికా పైన, ఈశాన్య ఆసియాలోని దాని సైనిక స్థావరాల పైనా అణ్వాయుధ దాడులు చేస్తామని సోమవారం నాడు హెచ్చరించింది.
అమెరికా, దక్షిణ కొరియా ఏటా నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉత్తర కొరియా తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా దాడులు చేస్తే తిప్పికొట్టగల సామర్థ్యం ఉందో లేదో పరీక్షించుకునేందుకు ఈ విన్యాసాలు దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది.
ఇటీవల ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించడంతో ఈ ఏడాది ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. ఉత్తర కొరియా అత్యున్నత పరిపాలక వ్యవస్థ నేషనల్ డిఫెన్స్ కమిషన్ సోమవారం చేసిన ప్రకటనలో... అమెరికా భూభాగంపై, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల పైనా భారీ, ముందస్తు అణ్వాయధ దాడులు జరుపుతామని హెచ్చరించింది.
బటన్ ప్రెస్ చేస్తే మరుక్షణంలో శత్రు స్థావరాలు అన్నీ అగ్ని సముద్రాలుగా మారిపోతాయని, బూడిద కుప్పలుగా మిగిలిపోతాయని హెచ్చరించింది. దీనికి దక్షిణ కొరియా ధీటుగా స్పందించింది. ఉత్తర కొరియా తన దుష్ప్రవర్తన మానుకోవాలని, లేకుంటే తాము దృఢ నిశ్చయంతో, నిర్దయగా స్పందిస్తామని దక్షిణ కొరియా హెచ్చరించింది.