‘మంచు ఉత్సవం’లోనూ.. ‘క్షిపణులు’: వేడి పుట్టిస్తున్న ఉత్తరకొరియా!
ప్యాంగ్యాంగ్: తన క్షిపణి ప్రయోగాలతో ప్రపంచానికి.. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు వెన్నులో చలిజ్వరం పుట్టిస్తున్న ఉత్తర కొరియా.. ప్రతీ సందర్భాన్నీ అందుకోసమే ఉపయోగిస్తోంది.
మొన్నటికి మొన్న.. అణు బటన్ నా టేబుల్ మీదే ఉంటుందని చెప్పిన ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్.. ఒకవేళ ఉత్తరకొరియా క్షిపణి దాడులు మొదలుపెడితే శత్రువు అంతుచూసేదాకా అవి కొనసాగుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కొత్త ఏడాది సందర్భంగా ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఇటీవల నిర్వహించిన మంచు ఉత్సవంలో కూడా ఊహించని ఆకృతలు ప్రదర్శించి ప్రపంచ దేశాలకు వేడి పుట్టించింది.
ప్యాంగ్యాంగ్లో మంచు ఉత్సవం...
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్.. క్షిపణులు, ఇతరత్రా అణ్వాయుధాల పట్ల తన దేశ ప్రజలను కూడా సన్నద్ధం చేస్తున్నాడు. ఇందుకు ఓ ఉదాహరణ.. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో కొత్త ఏడాది సందర్భంగా జరిగిన మంచు ఉత్సవం.
మంచుతోనే వివిధ ఆకృతులు...
ఉత్తరకొరియాలో ప్రతీ కొత్త సంవత్సరం వేళా ఓ మంచు ఉత్సవం జరుగుతుంది. వివిధ ఆకృతులను మంచుతో మలిచి ఈ ఉత్సవంలో ప్రదర్శనకు ఉంచుతారు. వేలాది మంది ప్రజలు ఈ మంచు ఉత్సవానికి విచ్చేసి ఆయా ఆకృతులను తిలకిస్తారు.
మునుపెన్నడూ చూడని ఆకృతులు...
సాధారణంగా ఈ మంచు ఉత్సవంలో కొరియా సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆకృతులే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం ఈ ఉత్సవంలో గతంలో ఎన్నడూ ఉత్తరకొరియా వాసులు చూడని ఆకృతులు దర్శనమిస్తున్నాయి.
అమెరికాను బుగ్గి చేసే క్షిపణి ఇదే...
ఉత్తరకొరియా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి- హుయాసాంగ్-15ను మంచుతో మలిచి ఆ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు. ‘అమెరికాను బుగ్గి చేయగలిగే క్షిపణి ఇదే.. ప్రజల సందర్శనార్థం సగర్వంగా దీన్ని సమర్పిస్తున్నాం..' అంటూ ప్రభుత్వం చెబుతోంది.
మంచుతో యుద్ధట్యాంకులు...
అంతేకాదు, ఈ మంచు ఉత్సవంలో ఇంకా అనేక రకాల క్షిపణులు, జలాంతర్గాములు, యుద్ధట్యాంకులు, ఆయుధ సామగ్రిని మంచుతో రూపొందించి ఆ శిల్పాలను కూడా ప్రజల సందర్భనార్థం ప్రదర్శిస్తున్నారు.
ఫొటోలు, సెల్ఫీల ఆనందంలో...
ఉత్తరకొరియా ప్రజలు కూడా అమిత ఉత్సాహంతో వాటి ముందు సెల్ఫీలు దిగుతున్న ఫోటోలను ఆ దేశ అధికార వార్తాపత్రిక.. రొడాంగ్ సిన్మున్ కూడా ప్రచురించింది. అంతేకాదు... ఈ బాలిస్టిక్ క్షిపణితో ఓ స్మారక స్టాంపును కూడా ఉత్తరకొరియా ప్రభుత్వం విడుదల చేసింది.