చెల్లెలి మాట విని: దక్షిణ కొరియాకు పొగబెట్టిన కిమ్జొంగ్: కమ్యూనికేషన్లు కట్: టెలిఫోన్ సహా
సియోల్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్జొంగ్ ఉన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియాకు పొగ బెట్టారు. ఆ దేశంతో ఉన్న అన్ని రకాల కమ్యూనికేషన్ల వ్యవస్థను తెంచేశారు. ఒకరకంగా దక్షిణ కొరియాతో తెగదెంపులకు దిగారు. దక్షిణ కొరియాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కిమ్జొంగ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన నియంతృత్వ వైఖరి ఎలా ఉంటుందనేది మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేశారాయన.
Recommended Video
ఆధునిక నియంత కిమ్జొంగ్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా సంచలన ప్రకటన: పెదవి విప్పని ఉత్తర కొరియా
చెల్లెలు మాట విని..
దీనికంతటికీ కారణం కిమ్జొంగ్ చెల్లెలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె చేసిన సిఫారసుల మేరకే కిమ్జొంగ్ దక్షిణ కొరియాతో సమాచార వ్యవస్థను స్తంభింపజేశారని తెలుస్తోంది. దక్షిణ కొరియాతో దౌత్యపరమైన సంబంధాలు, ఆ దేశంతో అనుసరించాల్సిన విదేశాంగ విధానాలు, ఇతరత్రా వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షణ బాధ్యతలను కిమ్ సోదరి కిమ్ యో జొంగ్ అయిదురోజుల కిందటే స్వీకరించారు. ఆమె బాధ్యతలను చేపట్టిన తొలిరోజుల్లోనే దక్షిణ కొరియాతో తెగదెంపుల దిశగా ఉత్తరకొరియా అడుగులు వేసింది.
హాట్లైన్, టెలిఫోన్ సహా
ఉత్తర, దక్షిణ కొరియాలను అనుసంధానించే ఎలాంటి సమాచార వ్యవస్థ కూడా ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పనిచేయవు. ఈ మేరకు కిమ్జొంగ్ ఆదేశాలను జారీ చేసినట్లు ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. రెండు దేశాధినేతల మధ్య సంభాషించడానికి అనువుగా ఏర్పాటు చేసుకున్న హాట్లైన్ వ్యవస్థ సహా ఏ ఒక్క కమ్యూనికేషన్ కూడా దక్షిణ కొరియాతో అనుసంధానమై ఉండట్లేదని పేర్కొంది.
శతృవుగా అభివర్ణన
ఈ సందర్భంగా కేసీఎన్ఏ దక్షిణ కొరియాను శతృవుగా అభివర్ణించింది. ఉత్తరకొరియా పాలకులు.. తన ఎనిమీ దక్షిణ కొరియాతో అన్ని రకాల సమాచార వ్యవస్థలను తెంచుకున్నట్లు పేర్కొంది. ఉత్తరకొరియాకు చెందిన పౌరులు ఎవరు కూడా కమ్యూనికేషన్ల ద్వారా దక్షిణ కొరియాతో అనుసంధానం కాలేరు. ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ, దక్షిణ కొరియా అధికార నివాసం బ్లూ హౌస్ మధ్య కూడా సమాచార సంబంధాలు తెగిపోయినట్లు స్పష్టం చేసింది.
మిలటరీ కమ్యూనికేషన్లు కూడా..
మిలటరీ కమ్యూనికేషన్ల వ్యవస్థను కూడా తొలగింపుల జాబితాలోకి చేర్చడం ఉత్తర కొరియాకు ఉన్న అసహనాన్ని స్పష్టం చేసినట్టయిందని చెబుతున్నారు. ఈస్ట్, వెస్ట్ సీస్ కమ్యూనికేషన్ లైన్లు, రెండు దేశాల మిలటరీతో లింకప్ అయి ఉండే సమాచార వ్యవస్థలపైనా దానీ ప్రభావం పడింది. దక్షిణకొరియాతో కుదుర్చుకున్న మిలటరీ అగ్రిమెంట్లను రద్దు చేయడానికి కూడా ఉత్తర కొరియా వెనుకాడకపోవచ్చని అంటున్నారు. 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ పర్యటన సందర్భంగా ఈ రెండు దేశాల మధ్య మిలటరీ ఒప్పందం కుదిరింది.
దక్షిణ కొరియా ఆందోళనకారులే కారణమంటూ
దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు కిమ్ నియంతృత్వ వైఖరికి నిరసనగా ఇటీవలే సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. ఉత్తరకొరియా భూభాగంలో పడేలా కరపత్రాలను గాల్లోకి విసిరేశారు. దీనిపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. సరిహద్దు మీదుగా వస్తున్న బెలూన్లను నిలువరించడంలో దక్షిణ కొరియా ప్రభుత్వం విఫలమైందని భావిస్తోంది ఉత్తర కొరియా. ఫలితంగా తన ఆగ్రహాన్ని, అసహనాన్ని ఇలా ప్రదర్శించిందని చెబుతున్నారు.
కొన్నేళ్గగా బెలూన్లు వివాదం..
రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా ఈ బెలూన్ల వివాదం నడుస్తోంది. దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద బెలూన్లను ఎగుర వేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఓ సారి కిమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీటిని గనుక నిలవరించకపోతే.. సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన కార్యాలయాలను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించారు. ఈ బుడగలపై నిషేదం విధిస్తామని అప్పట్లో దక్షిణ కొరియా ప్రకటించింది. పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేకపోవడంతోనే.. కిమ్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.