కిమ్ జాంగ్ మరణం 99% కన్ఫామ్.. ఉత్తరకొరియా పగ్గాలు చెల్లెలికే.. ఐక్యరాజ్యసమితి క్లారిటీ..
కిమ్ జాంగ్ ఉన్ మరణ వార్తలు చక్కర్లు కొడుతున్నవేళ.. కమ్యూనిస్ట్ దేశమైన ఉత్తరకొరియాలో ఈ ఏడాది కార్మిక దినోత్సవం(మేడే) నిర్వహించారో లేదో వెల్లడికాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సొంత దేశంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్కు ధీటుగా కిమ్ పై పుట్టుకొస్తున్న వార్తలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. కిమ్ దేశానికే చెందిన కీలక వ్యక్తి ఒకరు మరో సెన్సేషనల్ ప్రకటన చేశారు. తైవాన్ ఇంటెలిజెన్స్ సైతం కొన్ని విషయాల్ని రూఢీ చేసింది. వీటికితోడు ఉత్తరకొరియా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Recommended Video
99 శాతం నిజం..
దక్షిణకొరియా జాతీయ అసెంబ్లీ సభ్యుడైన ‘జీ షియాంగ్ హూ' చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఒకప్పుడు ఉత్తరకొరియాలో కిమ్తో కలిసి పనిచేసిన ఆయన.. అక్కణ్నుంచి తప్పించుకునే క్రమంలో కాలు పోగొట్టుకున్నారు. కొనప్రాణాలతో సౌత్ కొరియాకు చేరుకుని, రాజకీయ ఆశ్రయం పొంది, అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. కిమ్ నియంతృత్వ పోకడల్ని చెండాడుతూ, నార్త్ కొరియన్ల స్వేచ్చ కోసం పాటుపడుతోన్న షియాంగ్ అంత్జాతీయంగానూ ఫేమస్. అలాంటి వ్యక్తి కిమ్ మరణాన్ని 99శాతం ధృవీకరిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
అందుకే ప్రకటన ఆలస్యం..
‘‘కిమ్ చనిపోయాడనే వార్తకు నేను 99 శాతం గ్యారెంటీ ఇవ్వగలను. గుండె ఆపరేషన్ వికటించడం వల్లే ఆయన చనిపోయారు. ప్రస్తుతం నార్త్ కొరియాలో పరిపాలన పగ్గాల్ని అతని చెల్లెలు కిమ్ యో జాంగ్ కు అప్పగించే ప్రక్రియ నడుస్తోంది. అధికారాల బదిలీపై పార్టీలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా కిమ్ యో పీఠమెక్కిన తర్వాతే కిమ్ జాంగ్ మరణంపై అధికారిక ప్రకటన వస్తుంది. అక్కడున్న స్నేహితుల ద్వారా నాకీ విషయాలు తెలిశాయి''అని జీ షియాంగ్ స్పష్టం చేశారు. నార్త్ కొరియా నుంచే పారిపోయి, అమెరికాలో స్థిరపడిన మరో అధికారి సైతం.. కిమ్ మిస్సైల్ టెస్టులో గాయపడ్డాడని చెప్పడం గమనార్హం.
తైవాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా..
కిమ్ మరణాన్ని 99 శాతం కన్ఫామ్ చేస్తానన్న జీ షియాంగ్.. దీనికి సంబందించిన చర్చ నార్త్ కొరియాలోనూ జోరుగా సాగుతున్నదని చెప్పారు. దేశ ప్రజలందరికీ కిమ్ అనారోగ్యం గురించి తెలిసినా, లోలోపల మాట్లాడుకోవడమేతప్ప, బహిరంగ చర్చలకు అవకాశం లేదన్నారు. మరోవైపు తైవాన్ ఇంటెలిజెన్స్ సంస్థ(నేషనల్ సెక్యూరిటీ బ్యూరో-ఎన్ఎస్బీ) డైరెక్టర్ క్యో కుచెంగ్ కూడా కిమ్ మరణాన్ని దాదాపు ధృవీకరించారు. ‘‘కిమ్ అనారోగ్యానికి గురైనమాట వాస్తవం. ఇన్ఫర్మేషన్ రూఢీ చేసుకున్న తర్వాతే ఈ విషయాన్ని చెబుతున్నా. అయితే ఆయన ప్రాణాలు కోల్పోయారనేది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది''అని కుచెంగ్ మీడియాతో అన్నారు.
ఐరాస క్లారిటీ..
ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ కు గుండె ఆపరేషన్ వికటించడంతో చనిపోయారంటూ ప్రపంచమంతటా వార్తలు చెక్కర్లు కొడుతున్నవేళ.. ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. కిమ్ ఆరోగ్యం గురించి ఐరాసకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. దీనిపై ఉత్తరకొరియా ప్రతినిధులెవరూ ఇప్పటిదాకా ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని స్పష్టం చేశారు. కిమ్ జాంగ్ చివరిసారి ఏప్రిల్ 11న ప్రజలకు కనిపించారు. ఆ తర్వాత ఏప్రిల్ 15న ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి వేడుకలకు గైర్హాజరు కావడంతో ఆయన ఆరోగ్యంపై వదంతులు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే..
కిమ్ సంతకంతో ప్రకటన..
తమ దేశాధినేతపై ప్రపంచ మీడియాలో వస్తోన్న వార్తల్ని నార్త్ కొరియా లెక్కచేయడంలేదు. పైగా, కిమ్ బతికే ఉన్నారనడానికి సంకేతంగా బుధవారం(ఏప్రిల్ 29న) మరో అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. దేశ ఐక్యత, ప్యోంగ్యాంగ్ లో ఆస్పత్రి నిర్మాణం, చైనాలో పనిచేస్తోన్న ఉత్తరకొరియన్లను మరికొంత కాలం కొనసాగించే అంశాలపై కిమ్ సంతకంతో ఆదేశాలు వెలువడ్డాయి. సాధారణంగా ప్రతి బుధ, గురువారాల్లో ఈరకమైన ఆదేశాలు విడుదల చేయడం సహజం. అయితే ప్రతిసారి కనీసం 7 నుంచి 10 ఆదేశాలతో ఉత్తర్వులుంటాయి. ఈసారి మాత్రం కేవలం 3 అంశాలతోనే ఉత్తర్వులు జారీకావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.