శత్రు దేశానికి తొలిసారిగా.. కిమ్ సోదరి! ఇప్పటికే దక్షిణ కొరియాలో ప్రేయసి!?
ప్యోంగ్యాంగ్: దక్షిణ కొరియాతో ఏళ్ల తరబడి వైరం కొనసాగించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు తన పద్ధతి మార్చుకున్నారు. ఒకప్పుడు దక్షిణ కొరియా పేరు చేబితే చాలు అగ్గిమీద గుగ్గిలమైన ఆయన ఇప్పుడు ఆ దేశంతో ఎంతో సఖ్యత కనబరుస్తున్నారు.
కొరియన్లు ఏకం కావాలంటూ ఆ మధ్య పిలుపునిచ్చి ప్రపంచాన్ని కిమ్ జోంగ్ ఉన్ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు, దక్షిణ కొరియా శీతాకాల ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా ఇప్పటికే తన ప్రేయసి హోన్ సాంగ్ వోల్ను ఆ దేశం పంపించిన కిమ్ తాజాగా తన సోదరి కిమ్ యో జోంగ్ను కూడా శత్రుదేశానికి పంపబోతున్నారు.
రేపట్నించే శీతాకాల ఒలింపిక్స్...
దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్ క్రీడలకు వేళయింది. రేపట్నించే అక్కడ ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. అక్కడి ప్యాంగ్చాంగ్ ఒలింపిక్ స్టేడియంలో శీతాకాల ఒలింపిక్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు ఈ ఒలింపిక్స్ జరుగుతాయి. ఉత్తర కొరియాతో కలిపి 92 దేశాలకు చెందిన 2,952 మంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్లో పాల్గొననున్నారు. ఏడు క్రీడలకు సంబంధించిన 102 ఈవెంట్లు ఈ ఒలింపిక్స్లో నిర్వహించనున్నారు.
ఇప్పటికే దక్షిణ కొరియాలో కిమ్ ప్రేయసి...
దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఉత్తరకొరియా తరుపున పాల్గొనేందుకు తన దేశం నుంచి కిమ్ ఓ అందగత్తెల సైన్యం(బ్యూటీ ఆర్మీ)ను కూడా పంపించారు. వీరికి నేతృత్వం వహించేందుకు ఆయన వారి వెంటన తన ప్రేయసి హోన్ సాంగ్ వోల్ను కూడా పంపించారు. గతంలో కిమ్ తన ప్రేయసిని హత్య చేయించారంటే పుకార్లు షికారు చేశాయి. కానీ కిమ్ ప్రేయసి ఉత్తరకొరియా నుంచి వచ్చిన అందగత్తెల సైన్యం వెంట కనిపించడంతో అవన్నీ వదంతులేనని తేలిపోయాయి. ప్యోంగ్యాంగ్కు చెందిన మారన్ బాంగ్ బ్యాండ్ను కిమ్ జోంగ్ ఉన్ హస్తగతం చేసుకున్నారు. ఈ బ్యాండ్కు చెందిన మహిళలు కిమ్ ఆదేశానుసారం స్టేజ్ షోలు చేస్తుంటారు. ఇప్పుడు ఇదే బ్యాండ్ను దక్షిణకొరియాలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో కిమ్ ప్రేయసి హోన్ సాంగ్ వోల్ లీడ్ చేయనున్నారు.
ఇప్పుడు కిమ్ సోదరి కూడా...
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా తొలిసారిగా తన శత్రుదేశం అయిన దక్షిణ కొరియా గడ్డపై కాలుమోపనున్నారు. దక్షిణ కొరియాలో 9వ తేదీ నుంచి శీతాకాల ఒలింపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో కిమ్ తన సోదరి అయిన కిమ్ యో జోంగ్ను కూడా ఆ దేశానికి పంపాలని నిర్ణయించారు. ఉత్తర కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీలో కిమ్ సోదరి కీలక నాయకురాలు. ఇప్పుడామెను తన దేశ ప్రతినిధిగా కిమ్ దక్షిణ కొరియాకు పంపుతున్నారు. ఎందుకంటే, ఈ శీతాకాల ఒలింపిక్స్లో ఉత్తరకొరియా తరపున ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల బృందానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే సభ్యులలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఒకరు.
ఉత్తరకొరియా నుంచి క్రీడాకారులు...
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఏళ్లతరబడి సాగిన తీవ్రస్థాయి విభేదాలను ఈ శీతాకాల ఒలింపిక్స్ కొంత వరకు తగ్గించాయి. గత రెండేళ్లలో తొలిసారిగా ఉభయ దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం దక్షిణ కొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్కు తమ దేశం తరపున కూడా క్రీడాకారులు పాల్గొంటారంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆయన ఇప్పటికే తన దేశం నుంచి 22 మంది క్రీడాకారుల బృందాన్ని కూడా దక్షిణ కొరియాకు పంపించారు. క్రీడాకారుల కంటే ముందుగా ఉత్తరకొరియాకు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన లాజిస్టిక్ అధికారుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్కు చేరుకుంది.
36,000 మంది విదేశీయులపై నిషేధం...
దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్ సందర్భంగా ఆ దేశంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ఇప్పటికే 36,000 మంది విదేశీయులపై నిషేధం కూడా విధించింది. ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా ఆ దేశ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒలింపిక్స్కి హాజరుకావాలనుకునే విదేశీయుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాకే వారిని అనుమతించాల్సిందిగా దక్షిణ కొరియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అథ్లెట్లకు కిమ్ బంపర్ ఆఫర్...
దక్షిణ కొరియా శీతాకాల ఒలింపిక్స్కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశం తరుపున క్రీడాకారులను పంపించడమేకాదు, ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించే వారికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అథ్లెట్లకు ఇళ్లు, మెర్సిడెస్ బెంజ్ కార్లు, ఉద్యోగాలు బహుమతిగా ఇస్తామని కిమ్ ప్రకటించారు. బంగారు పతకం గెలిస్తే బెంజ్ కారు, ఓ ఫ్లాట్ బహుమతిగా ఇస్తానన్నారు. సాధారణ పతకాలు గెలిచిన వారికి జ్ఞాపికలతో పాటు క్రీడల నుంచి వారు రిటైర్ అయ్యాక ఉద్యోగాలు ఇస్తానని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. గతంలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో ఉత్తరకొరియాకి చెందిన అథ్లెట్లు 16 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 56 పతకాలు సాధించారు.
కిమ్కు క్రీడలంటే ప్రాణం, అందుకే...
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్కు క్రీడలంటే ఇష్టం. స్కీయింగ్, బాస్కెట్ బాల్ అంటే ఆయనకు ప్రాణం. అందుకే క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారిని ఆయన అమితంగా ప్రోత్సహిస్తుంటారు. అసలు ఒలిపింక్స్లో ఉత్తర కొరియా క్రీడాకారులు పతకాలు గెలవాలేగానీ ఆ తరువాత వారి జీవితమే మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఏటా ఒలింపిక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉన్న నలుగురు చిన్నారులను ఎంపిక చేసి వారికి సరైన శిక్షణ ఇప్పించాలని కూడా కిమ్ నిర్ణయించారు. అలాంటి చిన్నారులను ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్కు పిలిపించి వారికి 20 ఏళ్లు వచ్చే వరకు కఠిన శిక్షణ ఇప్పించాలని, వారికి మంచి భోజన సదుపాయం, జీతం కల్పించాలని, 20 ఏళ్ల వరకు వారికి పెళ్లి చేసుకునేందుకు అనుమతి కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు.