ఆ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది మృతి... విచారణకు ఆదేశం, వ్యాక్సిన్ పై అనుమానాలు..?
నార్వే: ప్రపంచదేశాలన్నీ ఈ రోజు భారత్ ప్రారంభించిన వ్యాక్సినేషన్ గురించి చర్చించుకుంటుండగా... నార్వే మాత్రం విషాదంలో మునిగిపోయింది. కరోనాపోరులో భాగంగా ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలోనే నార్వే కూడా కోవిడ్-19 వ్యాక్సిన్కు అనుమతిచ్చింది. ఫైజర్-బయోఎన్టెక్ సంస్థల నుంచి తయారైన వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది నార్వే పౌరులు కొద్ది సమయానికే మృతి చెందారు. వీరంతా వృద్ధులే కావడం విశేషం. దీంతో 80 ఏళ్ల పైబడి వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వరాదంటూ నార్వేయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరికలు జారీ చేసింది. వారు ఈ వ్యాక్సిన్ వల్ల పెద్దగా మేలు జరగకపోవచ్చని అభిప్రాయపడింది. ఇక ఇతర జబ్బులతో బాధపడేవారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే చిన్న పాటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అదే సమయంలో అవి చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీయొచ్చని అభిప్రాయపడింది.
ఇక మొత్తం 23 మంది మృతి చెందడంతో ఫైజర్ మరియు బయోఎన్టెక్ సంస్థలు, నార్వేయన్ అధికార సంస్థలు సంయుక్తంగా విచారణ ప్రారంభించాయి. ఈ మరణాలకు కారణాలను ఇంకా విశ్లేషించాల్సి ఉందని ఫైజర్ సంస్థ పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్తోనే ఈ మరణాలు సంభవించాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తెలుస్తుందని ఫైజర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే మరణించిన 23 మందిలో 13 మంది సైడ్ ఎఫెక్ట్స్తో మరణించారు. అది కూడా డయేరియా, నాసియా, జ్వరంతో మరణించారని నిపుణులు చెప్పారు. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న 21 మంది మహిళలు, 8 మంది పురుషుల్లో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు నార్వేయన్ మెడిసెన్స్ ఏజెన్సీ నిర్థారించింది.
ఇక మరణించిన 23 మందిలో 9 మంది సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్తో మృతిచెందారని అయితే అలెర్జిక్ రియాక్షన్స్, తీవ్ర ఇబ్బందులు, తీవ్ర జ్వరంతో అయితే కాదని తెలుస్తోంది. ఇవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని వెల్లడించారు. ఇక ఏడు మంది మాత్రం తక్కువ స్థాయి తీవ్రత ఉన్న సైడ్ఎఫెక్ట్స్తో మృతి చెందారు. అంటే ఇంజెక్షన్ వేసిన ప్రాంతంలో నొప్పి కలగడం వంటి వాటితో మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవడంతో 23 మంది మరణించడంతో దర్యాప్తునకు ఆదేశించింది నార్వే ప్రభుత్వం. అసలు వ్యాక్సిన్తోనే వీరు మృతి చెందారా లేక ఇతరత్ర జబ్బులతో వీరు మరణించారా అనేది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే తప్ప బయటపడదు.