కాపాడేదెవరు?: ‘ఏసు ఫొటో బదులు జిన్పింగ్ ఫొటో పెట్టుకోండి’
బీజింగ్: క్రైస్తవులు ఆరాధించే క్రీస్తు ఫొటోకు బదులుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫొటో పెట్టుకోవాలని ఆ దేశ అధికారులు సూచించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరాలంటే జిన్పింగ్ ఫొటో పెట్టుకోవాల్సిందేనని అన్నారు.
'పేదరికం, అనారోగ్యం నుంచి క్రీస్తు కాపాడరు.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాపాడుతోంది' అని అధికారులు చెబుతున్నారు. అందుకే క్రీస్తు ఫొటోకు బదులుగా జిన్పింగ్ ఫొటోలు పెట్టండని అధికారులు తేల్చి చెబుతున్నారు.
కాగా, చైనాలోని యుగాన్ కౌంటీలో వేల సంఖ్యలో క్రైస్తవులు ఉంటారు. ఈ యుగాన్ కౌంటీలో ఉంటున్న ప్రజలు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నట్లు అక్కడి అధికారులుచెబుతుండటం గమనార్హం.
అయితే, యుగాన్ కౌంటీ ప్రజలు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు చేయడానికి సుముఖంగా ఉన్నారని వాషింగ్టన్ పోస్టు నివేదిక పేర్కొంది. ఇప్పటికే క్రైస్తవ మతానికి సంబంధించిన 624 పోస్టర్లను తొలగించి, వాటి స్థానంలో 453 జిన్పింగ్ ఫొటోలను పెట్టుకుంటున్నారట. 2020 నాటికి చైనాలో పేదరికాన్ని నిర్మూలించేందుకు.. ఇలా జిన్పింగ్ ఫొటోలు పెట్టుకోమని అధికారులు ప్రోత్సహిస్తుండటం గమనార్హం.