భారత్ నీళ్లు ఆపేస్తే మాకొచ్చే నష్టం ఏమీ లేదు, ఆ మూడు నదుల జోలికొస్తే మాత్రం: పాకిస్తాన్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్కు వెళ్లే నీటిని ఆపాలని భారత్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యల కారణంగానే పాక్ దిగి వచ్చి రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోన్నట్లుగా ఉంది.
పాక్కు మోడీ దిమ్మతిరిగే షాక్, నీళ్లు వెళ్లకుండా నిర్ణయం: ఏమిటీ ఇండస్ వాటర్ ట్రీటీ?
మాకు ఏ ఆందోళనా లేదు
నీటి నిలిపివేయడంపై పాకిస్తాన్ స్పందించింది. భారత్ నీటిని మళ్లించుకుంటే తమకు వచ్చే నష్టమేమీ లేదని, దీనిపై తాము ఎలాంటి ఆందోళనా చెందడం లేదని పాకిస్తాన్ నీటిపారుదల శాఖ కార్యదర్శి తెలిపారు. తూర్పు ప్రాంత నదుల జలాలను మళ్లించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అలాగే ఆందోళనా లేదని చెప్పారు. భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల మేమేమీ చింతించడం లేదన్నారు.
ఆ మూడు నదుల జోలికి వస్తే మాత్రం ఊరుకోం
కానీ తాము ఉపయోగించుకునే సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల నీటిని అడ్డుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని పాక్ నీటి పారుదల శాఖ కార్యదర్శి తెలిపారు.1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాలను వారి కోసం మళ్లించుకున్నారని, ఆ సమయంలో తాము అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఇప్పుడు అదే పని చేస్తున్నారని, దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాగా, రావి, సట్లేజ్, బియాస్ నదుల నుంచి 5 శాతం నీరు మాత్రమే పాకిస్తాన్ వెళ్తోందని వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ వేరుగా తెలిపారు. రెండు హైడ్రో ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆ నీరు కూడా ఎలాగూ ఆగిపోతుందని తెలిపారు.
నదుల ఒప్పందం
కాగా, సింధు జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్కు దక్కాయి. పుల్వామా దాడి నేపథ్యంలో మనదేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాలను పాకిస్థాన్కు వెళ్లకుండా నిలువరించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఆ నీటిని మళ్లించి జమ్ముకశ్మీర్, పంజాబ్ ప్రజలకు అందిస్తామని చెప్పారు.