హోడీ మోడీ: హూస్టన్ మోడీ మయం, 100 నిమిషాలపాటు ట్రంప్, ఎన్నారైల హోరు
హూస్టన్: ఇప్పుడు భారత్ తోపాటు అమెరికానే గాక ప్రపంచ దేశాలు కూడా హౌడీ మోడీ కార్యక్రమం గురించి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ కార్యక్రమం జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
వేలాది మంది భారతీయ అమెరికన్లు..
హూస్టన్ నగరంలోని ఎన్ఆర్జీ ఫుట్బాల్ మైదానంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని సుమారు 72వేల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. దాదాపు 50వేల మందికిపైగా భారతీయ అమెరికన్లు హాజరవుతున్నారు. 600 సంస్థలకు పైగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి.
100 నిమిషాలపాటు ట్రంప్
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొదట డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతారని తెలుస్తోంది. ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ట్రంప్ దాదాపు 30 నిమిషాలపాటు భారత్, భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. సుమారు 100 నిమిషాలపాటు ట్రంప్ ఈ సమావేశానికి వెచ్చించే అవకాశం ఉందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో ఇప్పటికే తెలపడం గమనార్హం.
బంధం బలోపేతం
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే సమయంలోనూ ట్రంప్ కార్యక్రమ వేదికపైనే ఉండనున్నారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవడం ఆయనకు కలిసివచ్చే అంశమని చెప్పవచ్చు. భారత్, అమెరికాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వైట్ హౌస్ శనివారం విడుదల చేసిన ప్రకటనలోనూ వెల్లడించింది.
హూస్టన్ మోడీమయం
కాగా, హోడీ మోడీ కార్యక్రమం కోసం అమెరికాలోని భారతీయులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వందలాది మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అమెరికా నలుమూలల నుంచి హూస్టన్ చేరుకుంటున్నారు. ఇప్పుడు హూస్టన్లో ఎక్కడ చూసిన మోడీ మానియా కనిపిస్తుండటం గమనార్హం. ఆయన అభిమానులు భారతీయ జెండాలు, మోడీ మాస్కులతో సందడి చేస్తున్నారు. చాలా చోట్ల మోడీ హోర్డింగులు పెట్టేశారు. మొత్తానికి హూస్టన్ మొత్తం మోడీ మయమైపోయింది.