శ్రీలంక మారణహోమం వెనుక ఎన్టీజే హస్తం?
కొలంబో : ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది. ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లలో 290 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే నరమేధం వెనుక నేషనల్ తౌహీత్ జమాత్... ఎన్టీజే హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎన్టీజేపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
దాడులతో లంకలో సంక్షోభం : ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు
ఎస్ఎల్టీజే అనుబంధ సంస్థ
దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న శ్రీలంక తౌహీత్ జమాత్ ఎస్ఎల్టీజేకు ఎన్టీజే అనుబంథ సంస్థగా భావిస్తున్నారు. శ్రీలంకలో మెజార్టీ వర్గమైన బౌద్దులపై విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు 2016లో ఎన్ఎల్టీజే కార్యదర్శి అబ్దుల్ రజీక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకలోని మవనెల్లాలో బౌద్ధ ప్రార్థనాలయాలపై గతేడాది జరిగిన దాడుల్లో ఎన్టీజే పాత్ర ఉన్నట్లు వార్తలొచ్చాయి.
ఆత్మాహుతిదాడుల హెచ్చరిక
తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నేషనల్ తౌహీత్ జమాత్ ఆత్మాహుతి దాడులు చేసే అవకాశముందని గతంలోనే శ్రీలంకకు హెచ్చరికలు అందాయి. పలు విదేశీ నిఘా సంస్థలు ఈ విషయాన్ని ఆ దేశం దృష్టికి తెచ్చాయి. ఎన్టీజే నాయకుడైన మహ్మద్ జహ్రాన్ ఆధ్వర్యంలో చర్చిలు, కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ను ఎన్టీజే లక్ష్యంగా చేసుకుందని స్పష్టం చేశాయి. అయితే ఆ సంస్థలు ఈ స్థాయి దాడులు చేసే సామర్థ్యం లేదని, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సాయం అంది ఉంటుందని అనుమానిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని ఎన్టీజే
సోషల్ మీడియాలో ఎన్టీజే సంస్థ ప్రభావం అంతంత మాత్రమే. ఈ సంస్థ ట్విట్టర్ అకౌంట్లో గతంలో తమిళంలో పోస్టులు ఉండేవి. కానీ 2018 మార్చి నుంచి అందులో ఎలాంటి పోస్టులు పెట్టలేదు. ఇక విద్వేషాలను రగిల్చే వీడియోలను పెట్టే యూట్యూబ్ ఛానెల్ వీక్షకులు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉండటం గమనార్హం.