5ని.ల్లో ఢిల్లీపై అణుదాడి చేయగలం: పాక్ ఖాదీర్, మేం తలుచుకుంటే..: భారత్
లాహోర్/న్యూఢిల్లీ: భారత దేశ రాజధాని న్యూఢిల్లీ పైన అయిదు నిమిషాల్లోనే అణ్వాయుధాలతో దాడి చేసే సత్తా పాకిస్తాన్కు ఉందని పాక్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదీర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్ తొలి అణ్వాయుధ పరీక్ష నిర్వహించి పద్దెనిమిదేళ్లయింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1984లోనే పాక్ అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశంగా అవతరించేదని, కానీ ఆనాడు అధ్యక్షుడు జియా ఉల్ హక్ అణ్వాయుధ పరీక్షలను నిర్వహించడాన్ని వ్యతిరేకించారని తెలిపాడు.
రావల్పిండిలోని కహుటా నుంచి భారత రాజధాని ఢిల్లీ లక్ష్యంగా అయిదు నిమిషాల్లో అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం పాక్కు ఉందన్నాడు. తన సేవలు లేకపోతే తొలి ముస్లిం అణ్వాయుధ దేశంగా పాక్ అవతరించి ఉండేది కాదన్నాడు. అణుశాస్త్రవేత్తల పట్ల పాక్ గౌరవంగా వ్యవహరించట్లేదని అభిప్రాయపడ్డారు.
1998లో ఖాన్ పర్యవేక్షణలోనే పాక్ తొలిసారి అణు పరీక్షలు నిర్వహించింది. అణు సాంకేతికతకు సంబంధించిన సమాచారం బహిర్గతం కావడానికి బాధ్యుడిగా ఖాన్పై ఆరోపణలున్నాయి. 2004 నుంచి ఐదేళ్లపాటు ఆయన గృహనిర్బంధంలో ఉన్నారు. 2009లో ఇస్లామాబాద్ హైకోర్టు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించింది.
కాగా, ఆయన వ్యాఖ్యలపై భారత మేధావులు, రక్షణ రంగ మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. ఐదు నిమిషాల్లో దాడి అసాధ్యమని, దాడికి కనీసం ఆరు గంటలు పడుతుందని స్పష్టంచేశారు.
మొత్తం పాక్నే నిర్మూలించగల అణ్వస్త్ర సామర్థ్యం భారత్ సొంతమన్నారు. ఇవి అపరిపక్వమైన, అసాధారణ వ్యాఖ్యలని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ విజ్ అభిప్రాయపడ్డారు. గోరంతను కొండంతలో చెప్పడంలో ఖాదిర్ ఆరితేరాడని మాజీ అధికారి గుర్మీత్ కన్వాల్ విమర్శించారు.