విద్యార్థినిపై కిరోసిన్ పోసి సజీవ దహనం.. 16 మందికి ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ఢాకా : బంగ్లాదేశ్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే కేసులో 16 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఆ మేరకు గురువారం (24.10.2019) నాడు తీర్పు వెలువరించింది. నుస్రత్ జహన్ రఫీ అనే విద్యార్థిని సజీవ దహనం కేసులో న్యాయస్థానం ఇలా స్పందించింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏళ్లకు ఏళ్లుగా కోర్టులో విచారణ సాగే కేసులున్న తరుణంలో.. ఈ కేసులో కేవలం 2 నెలల వ్యవధిలోనే ఇలాంటి సంచలన తీర్పు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లైంగిక వేధింపులు.. కేసు వాపసు తీసుకోకుంటే..!
నుస్రత్ జహాత్ ఓ ట్రైనింగ్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. దాంతో జరిగిన ఘటనపై ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ కేసు వాపసు తీసుకోవాలంటూ నుస్రత్ను పలుమార్లు బెదిరించాడు. అయినా అతడి బెదిరింపులకు నుస్రత్ భయపడలేదు. దాంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తి ఏప్రిల్ 6వ తేదీన మరికొంత మంది సాయంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. ఆ క్రమంలో 80 శాతం కాలిన గాయాలతో ఉన్న నుస్రత్ను మెరుగైన వైద్యం కోసం ఓ హాస్పిటల్లో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూనే అదే నెల 10వ తేదీన ఆమె చనిపోయారు.
సీఎం కుర్చీ 50-50.. బీజేపీతోనే ప్రభుత్వం.. శివసేన ఫార్ములా.. 29 ఏళ్లకే ముఖ్యమంత్రా?
నుస్రత్ మరణంతో ఢాకాలో నిరసనల పర్వం.. స్పందించిన ప్రధాని
ఆ సమయంలో నుస్రత్ మరణంపై బంగ్లాదేశ్ రాజదాని ఢాకాలో నిరసనలు మిన్నంటాయి. ఆమె చనిపోవడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్తో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే ఆ ఘటనపై తీవ్రంగా స్పందించిన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా నిందితులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అదే క్రమంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
18 మంది అరెస్ట్
నుస్రత్ కేసుకు సంబంధించి కోర్టు సంచలన తీర్పు వెలువరించిన తరుణంలో స్థానిక ఎస్పీ మహమ్మద్ ఇక్బాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నుస్రత్ సజీవ దహనం కేసులో అప్పుడు 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారందరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో నుస్రత్ పెట్టిన కేసును వాపసు తీసుకోకుంటే ఆమెను హత్య చేయాల్సిందిగా సదరు ట్రైనింగ్ ఇన్ఛార్జ్ తమను ఆదేశించినట్లు దర్యాప్తులో వెల్లడించినట్లు ఎస్పీ చెప్పారు.
ఈ విజయం టానిక్.. బాధ్యత పెరిగింది.. హుజుర్నగర్ ప్రజలను కలుస్తా : సీఎం కేసీఆర్
62 రోజుల్లో విచారణ పూర్తి.. 16 మందికి మరణ శిక్ష
అయితే ఆమెను సజీవ దహనం చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారట. కానీ, తనకు నిప్పంటించిన తర్వాత ఆమె కాలిపోతూ రోడ్డు పైకి రావడంతో అసలు విషయం వెలుగు చూసిందని వివరించారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నిందితుల్లో ఆమె క్లాస్మేట్స్ కూడా ఉన్నారని ఎస్పీ చెప్పారు. మొత్తానికి ఈ కేసులో కేవలం 62 రోజుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేసిన న్యాయస్థానం 16 మందికి మరణ శిక్ష విధించడం విశేషం. కోర్టు తీర్పుపై బంగ్లాదేశ్లో హర్షం వ్యక్తమవుతోంది. అలాంటి రాక్షసులు బతికి ఉంటే ఎంతో మంది అమాయక ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయనే రీతిలో స్థానికులు మండిపడుతున్నారు.