అమెరికాకు భారత్ నో!: మోడీకి ఫోన్ చేసిన ఒబామా
ఢిల్లీ/వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేశారు. వాతావరణ మార్పుల పైన చర్చించే విషయమై ఆయన ఫోన్ చేశారు. వాతావరణ మార్పుల పైన దృఢమైన ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ వాతావరణ ఒప్పందంపై భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒబామా ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడటం గమనార్హం.
దృఢమైన వాతావరణ ఒప్పందం కోసం ఇరువురు నేతలుతమ వ్యక్తిగత చిత్తశుద్ధిని స్పష్టం చేశారని, విజయవంతమైన తుది ఫలితం కోసం కలిసి కృషి చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారని వైట్ హౌస్ వెల్లడించింది.
వైట్ హౌస్ అధికారులు మాట్లాడుతూ... అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్యారిస్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని, మోడీకి ఫోన్ చేసి ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల పైన మాట్లాడారని తెలిపారు. ప్యారిస్ సదస్సు విజయవంతమవుతుందని ఒబామా ఆశాభావంతో ఉన్నారన్నారు.
ఒబామాతో మాట్లాడిన సందర్భంగా కాలిఫోర్నియా కాల్పుల్లో మృతి చెందిన వారికి ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారన్నారు. కాగా, అంతకుముందు రోజు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తో మాట్లాడారు.
భూతాపం తగ్గించే లక్ష్యంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన యత్నాలపై మాట్లాడారు. ఇదిలా ఉండగా, వాతావరణ మార్పుల పైన తొలుత అగ్రదేశాలు పునరాలోచించాలని ప్రధాని మోడీ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.