ఓ మైగాడ్: ఒకే సారి 292 మొసళ్లను చంపారు..ఎందుకో తెలుసా..?
ఇండోనేషియాలో దారుణం చోటుచేసుకుంది. ఆ దేశంలోని ఓ గ్రామంలో నివసించే వాళ్లు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 292 మొసళ్లను చంపేశారు. అయితే వారు చంపింది కేవలం ఆగ్రహంతోనే. ఇందుకు కారణం అక్కడి మొసలి సంరక్షణ కేంద్రంలో ఓ మొసలికి ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తిండిపెడుతుండగా అది అమాంతంగా ఆ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు ఆ మొసలి సంరక్షణ కేంద్రంలో ఉన్న 292 మొసళ్లను వేటకొడవళ్లతో, కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
ఒక మొసలి ఆకలి తీర్చేందుకు అక్కడే పనిచేసే ఓ వ్యక్తి గడ్డి సముకూరుస్తుండగా ఆ మొసలి ఆవ్యక్తిపై దాడి చేసి చంపేసిందని మొసలి సంరక్షణ కేంద్రం అధికారి వెల్లడించారు. మొసలి ఆ వ్యక్తిపై దాడి చేస్తున్న సమయంలో తనను కాపాడాల్సిందిగా ఆ వ్యక్తి బిగ్గరగా కేకలు వేశాడని అయితే అక్కడికి చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అధికారి వివరించారు.
మృతి చెందిన వ్యక్తి అంతిమ సంస్కారాల తర్వాత గ్రామస్తులు ఆగ్రహంతో మొసళ్ల సంరక్షణ కేంద్రానికి కత్తులతో, వేటకొడవళ్లతో చేరుకున్నారు. ఆగ్రహంతో వారంతా అక్కడ సేదతీరిన మొసళ్లను చంపేశారు. ఇందులో చిన్న పెద్ద మొసళ్లతో కలిపి మొత్తం 292 ఉన్నాయని అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతమంతా మొసళ్ల రక్తంతో నిండిపోయిందని అధికారి చెప్పారు. అరుదుగా ఉండే సాల్ట్ వాటర్ మొసళ్లు, న్యూగినియా మొసళ్లను సంరక్షించేందుకు అక్కడి ప్రభుత్వం 2013లో లైసెన్సు జారీ చేసిందని అధికారి వివరించారు.
ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే... జంతు సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న పరిసరాలకు కూడా భద్రత కల్పిస్తేనే లైసెన్సులు జారీ చేయాలని అధికారి వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పిన అధికారి... విచారణకు సహకరిస్తున్నట్లు తెలిపారు.