Omicron:అమెరికాలో ఫస్ట్ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసు.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా దేశాలను చుట్టేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఒమిక్రాన్ వైరస్ కేసు వచ్చింది. అమెరికాలో కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ మొదటి కేసు వచ్చింది. కాలిఫోర్నియాలో కొత్త వేరియెంట్ కేసు వెలుగుచూసింది. దీంతో అమెరికన్లు అందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ కోరారు.
ప్రజలను రక్షించడానికి మేం ఏం చేయాలో మాకు తెలుసు అని ఆయన తెలిపారు. ఇప్పటికే టీకాలు వేయించుకోకుంటే వెంటనే టీకాలు వేయించుకోవాలని కోరారు. ఎంఆర్ఎన్ఏ లేదా లేదా జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను వేయించుకోవాలని సజెస్ట్ చేశారు. నవంబర్ 30వతేదీ నాటికి 197.1 మిలియన్ల మంది యూఎస్ జనాభాలో 60 శాతం మంది పూర్తిగా టీకాలు వేయించుకున్నారని వివరించారు.

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన డేటా ప్రకారం 41.1 మిలియన్ల మంది బూస్టర్ షాట్ను వేయించుకున్నారు. కాలిఫోర్నియాలో రెండు డోసుల టీకాలు వేయించుకున్న ప్రయాణికుడికి ఒమైక్రాన్ వేరియెంట్ సోకిందని ఫౌసీ చెప్పారు. కొత్త వేరియెంట్ సోకిన రోగి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడని, రోగి కలిసిన వారిని పరీక్షించగా కరోనా నెగిటివ్ అని వచ్చిందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ప్రతీరోజూ వైద్యబృందంతో సమీక్షిస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి విలేకరులకు చెప్పారు. అమెరికా వచ్చే ప్రయాణికులకు పరీక్షల నియమాలను కఠినతరం చేస్తామని వారు చెప్పారు.
ఇటు విదేశీ ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరపాలని భారత ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. 'ఎట్ రిస్క్' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్ హిస్టరీ సేకరించాలని సూచించింది.