Omicron: మోస్ట్ డేంజరస్: టీనేజర్లు, వ్యాక్సిన్ వేసుకోని వారిపై పంజా: కాపాడుకోవడం ముఖ్యం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో తిష్ఠ వేసింది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టింది. ఇప్పటికే 21 కేసులు వెలుగులోకి వచ్చాయి. వాటి సంఖ్య పెరిగింది కూడా. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలల్లో ఈ కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య పెరగదనడానికి ఎలాంటి గ్యారంటీ ఉండట్లేదు. మహారాష్ట్రలో రెండు పాజిటివ్ కేసులు కొత్తగా రికార్డయ్యాయి.
డెల్టా కంటే.. డేంజరస్
ఇదివరకు కరోనా వైరస్కు సంబంధించిన ఒకట్రెండు వేరియంట్లు బయటపడ్డాయి. అవి పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. డెల్టా, డెల్టా వేరియంట్, ఇతర మ్యూటెంట్లు అదృష్టశావత్తూ కరోనా వైరస్ తీవ్రతను పెంచలేకపోయాయి. ఈ వేరియంట్పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేశాయి. దాన్ని నియంత్రించగలిగాయి. ఫలితంగా డెల్టా ప్లస్ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఈ వేరియంట్ల బారిన పడి మరణించిన వారి సంఖ్య పరిమితంగా నమోదైంది.
ఒమిక్రాన్ మూడు రెట్లు ప్రమాదకరం..
కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనదిగా తయారైంది. డెల్టా వేరియంట్ల కంటే మూడు నుంచి మూడున్నర రెట్లు తీవ్రతను కలిగి ఉంది. అంతే వేగంతో వ్యాప్తి చెందే లక్షణం దీనికి ఉంది. అందుకే- చాలా వేగంగా ఈ వేరియంట్ అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. భారత్ సహా ఇప్పటిదాకా 39 దేశాల్లో వ్యాప్తి చెందిందీ ఒమిక్రాన్ వేరియంట్. ఇది అక్కడితో ఆగేలా లేదు. రోజుకో కొత్త దేశంలో అడుగు పెడుతోంది.
పిల్లలు, వ్యాక్సిన్ వేసుకోని వారిపై..
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలు, వ్యాక్సిన్ వేసుకోని వారిపై తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 18 సంవత్సరాల లోపు పిల్లలు, టీనేజర్లపై ఈ వేరియంట్ పంజా విసరడం ఖాయంగా కనిపిస్తోందని స్పష్టం చేసింది. మున్ముందు- దీని తీవ్రత మరింత పెరిగే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోక తప్పదనీ సూచించింది. వైరస్ సోకిన 90 రోజుల తరువాత మళ్లీ దాడి లక్షణాలు దీనికి ఉన్నాయని, ఇది ఆందోళనకరమని పేర్కొంది.
క్లినికల్ డేటాను విశ్లేషించలేం..
ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోన్నందున.. దీనికి సంబంధించిన క్లినికల్ డేటాను విశ్లేషించలేమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. మరి కొంత డేటా అందాల్సి ఉందని, అప్పుడే పూర్తిస్థాయిలో దీని తీవ్రతను అనాలసిస్ చేయగలమని చెప్పారు. ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన పేషెంట్లు- ఆసుపత్రిలో చేరిన తరువాతే.. దీనికి సంబంధించిన క్లినికల్ డేటా అందుతుందని వ్యాఖ్యానించారు. దీనికోసం కనీసం మూడు వారాలపాటు వేచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Recommended Video
దక్షిణాఫ్రికాలో పిల్లలపై..
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన పేషెంట్లలో పిల్లలు, టీనేజర్లు అధికంగా ఉన్నారని సౌమ్యా స్వామినాథన్ చెప్పారు. వ్యాక్సిన్కు దూరంగా ఉంటోన్న వారికి కూడా ఇది త్వరితంగా సోకుతోందని అన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి కరోనా వైరస్ టీకాలు అందుబాటు లేవని, చాలా పరిమిత దేశాల్లో మాత్రమే పిల్లలకు వ్యాక్సిన్ అందుతోందని అన్నారు. అందుకే వారిని కాపాడుకోవడం ముఖ్యమని, దీనిపై అన్ని దేశాలు కూడా దృష్టి సారించాలని సూచించారు.