మసూద్ అజహర్ సమస్య పరిష్కారమవుతుంది, నమ్మండి: భారత్కు చైనా రాయబారి హామీ
న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ఇష్యూ త్వరలో పరిష్కారం అవుతుందని చైనా అంబాసిడర్ లూయో ఝావోహుయి ఆదివారం అన్నారు. మసూద్ అజహర్ అంశంపై ఓపికతో ఉందామని, తప్పకుండా ఐక్యరాజ్య సమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అంబాసిడర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్ ఆశలు ఫలించేలా ఉన్నాయని భావిస్తున్నారు.
2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్
భారత్ సమస్యను అర్థం చేసుకోగలం
భారత్ సమస్యను తాము అర్థం చేసుకోగలమని, తర్వలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చైనా రాయబారి లూయో ఝావోహుయి తెలిపారు. మసూద్ అజహర్ విషయానికి సంబంధించిన భారత్ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలమని, మేం భారత్ను నమ్ముతున్నామని, అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా చేర్చాలనే అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని, టెక్నికల్ సమస్యల కారణంగానే ఇది తేలడం లేదని, మా మీద నమ్మకం ఉంచాలని ఆయన అన్నారు.
భారత్ విశ్వాసం
మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై తాము ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీతో కలిసి పని చేస్తున్నామని, ఈ విషయంలో భారత్కు 14 సభ్యదేశాల మద్దతు ఉందని, హోల్డ్లో పెట్టడం అంటే ప్రతిపాదనను అడ్డుకోవడం కాదని, ఈ విషయంలో భారత సహనంతో ఉందని, అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్నామని, ఉగ్రవాదం ఎవరికైనా పెద్ద సవాల్ అని, పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని చైనాకు కూడా తెలుసునని, మసూద్ అజహర్ను ఐక్యరాజ్య సమితి ఐరాస తప్పకుండా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నామని శనివారం భారత అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
చివరి గంటలో మోకాలడ్డిన చైనా
కాగా, పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో మసూద్ అజహర్ను ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని పెద్దన్న అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఫిబ్రవరి 27న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదన తెచ్చాయి. ఈ ప్రతిపాదనకు చైనా చివరి గంటలో సాంకేతిక కారణాలు చూపి మోకాలడ్డింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా ప్రతిపాదనను హోల్డ్లో పెట్టింది. దీంతో భారత్ సహా ప్రపంచ దేశాలు అసంతృప్తితో ఉన్నాయి.