ప్లేన్ మంటల్లో చిక్కుకొని: నేతాజీ ఎలా చనిపోయారంటే.. బ్రిటిష్ వెబ్సైట్
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయారని చెబుతున్న ఆ రోజు ఏం జరిగింది? అనే వివరాలను ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బ్రిటిష్ వెబ్సైట్ ఒకటి వివరాలు తెలిపింది. నేతాజీ చివరి రోజులను విశ్లేషించేందుకు ఈ వెబ్సైట్ను ఏర్పాటు చేశారు.
విమాన ప్రమాదం జరిగి ఉండదని ఏడు దశాబ్దాలుగా కొన్ని వర్గాల్లో సందేహాలు ఉన్నాయని, అయితే నాలుగు నివేదికలు ఆయన విమాన ప్రమాదంలోనే చనిపోయినట్లు వచ్చాయని ఇది తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన నేతాజీతో పాటు ప్రయాణించిన వారి అనుభవాలకు సంబంధించిన దస్త్రాలను ఉంచింది.
విమానం ఎడమ ఇంజిన్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగిందని, వెంటనే కూలిపోవడంతో నేతాజీ మంటల్లో చిక్కుకున్నారని, తీవ్రంగా గాయపడ్డారని.. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన దస్త్రాలను అంతర్జాలంలో ఉంచింది. నేతాజీ చివరి సంభాషణలుగా చెబుతున్న మాటలనూ పొందుపరిచింది.
విమాన ప్రమాదం జరిగిన 1945 ఆగస్టు 18వ తేదీ ఉదయం జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులైన జపాన్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టరొ కొనొ, ఇంజినీరు కెప్టెన్ నకమురా అలియాస్ యమమోటో, బోస్ అనుచరుడు రెహ్మాన్లు చెప్పిన వివరాలను అందులో ఉంచింది.
ఆ రోజు విమానం వియత్నాలోని టౌరానే నుంచి బయలుదేరిందని, అందులో నేతాజీతో పాటు మరో 12, 13 మంది ప్రయాణీకులు, జపాన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సునామసా షిడైతో పాటు సిబ్బంది ఉన్నారని తెలిపింది. విమానం టోక్యో వెళ్లవలసి ఉందని పేర్కొంది.
మధ్యలో తైపీలో ఆగి, బయలుదేరింది. విమానం దాదాపు నలభై మీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత రన్ వే నుంచి వంద మీటర్ల దూరం వెళ్లిందని, ముందు భాగంలో మంటలు చెలరేగాయని, ఈ శబ్ధం ఫిరంగి గుళ్ల వర్షంలా వచ్చిందని, విమానం ఎడమ వైపుకు ఒరిగిందని సాక్ష్యులు చెప్పినట్లు అందులో పేర్కొంది.
'నేతాజీ నా వైపు చూశారు. వెనుక వైపు దారి లేదు. ముందు నుంచి వెళ్లిపోదామని చెప్పాను. ఎంట్రన్స్ దారి బ్లాక్ అయిందని, దానిలోంచి వెళ్లలేమని చెప్పాను. దాంతో మంటల్లోంచే నేతాజీ వడివడిగా కిందకు దూకారు. అవే మంటల్లోంచి నేను కూడా బయటకు వచ్చాను.
నేను బయటకు వచ్చి చూస్తే.. ఆయన నా కంటే పది అడుగుల ముందున్నారు. ఆగి వెనక్కి తిరిగి నావైపు చూశారు. అయితే, ఆయన దుస్తులకు మంటలు అంటుకున్నాయి. నేను పరుగు వెళ్లి ఆయన బుష్ షర్ట్ బెల్ట్ విప్పేందుకు చాలా కష్టపడ్డాను. ఆయన తలపై ఎడమ వైపున తెగినట్లు గుర్తించాను. మంటలకు ఆయన ముఖం, జుత్తు కాలిపోయాయి' అని బోస్ అనుచరుడు రెహ్మాన్ వివరించినట్లు పేర్కొంది.
'నీకేం కాలేదు కదా? అని నేతాజీ నన్ను అడిగారు. బాగానే ఉన్నానని చెప్పాను. భారత్కు వెళ్లినప్పుడు దేశం కోసం చివరి వరకు పోరాడానని చెప్పు. భారత్కు స్వాతంత్య్ర వస్తుంది. ఎవరూ బంధీగా ఉంచలేరని నేతాజీ నాతో అన్నార'ని రెహ్మాన్ వివరించినట్లు పేర్కొంది.
విమానం బయలుదేరే సమయం విషయమై మాట్లాడుతూ...
'విమానం ఎడమ వైపు ఇంజిన్ సరిగా పనిచేయడం లేదని గమనించాను. విమానంలోకి వెళ్లి పరీక్షించాను. బాగానే పని చేసింది. మరో ఇంజినీరు కూడా పరీక్షించి ప్రయాణించడానికి అనుకూలంగా ఉందని ధ్రువీకరించాడు' అని జపాన్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టరొ కొనొ తెలిపారు.
'విమానం ఎడమ ఇంజిన్లో లోపం ఉన్నట్లు పైలట్ మేజర్ కోనోకు తెలిపాను. ఐదు నిమిషాలు పరిశీలించిన తర్వాత పైలట్ రెండు సార్లు పరీక్షించాడు. బాగానే ఉందని పైలట్ కూడా అంగీకరించాడు. విమానం బయలుదేరి కొద్ది దూరం వెళ్లగానే ఎడమవైపు ఇంజిన్ వూడి కిందపడిపోయింది. మంటలు చెలరేగాయ'ని విమానాశ్రయ నిర్వాహణ ఇంజినీరు కెప్టెన్ నకమురా అలియాస్ యమమోటో తెలిపినట్లు వెల్లడించింది.