ఏ దుర్ఘటన జరిగినా మృతులు వందల్లోనే..! శ్రీలంక రక్తచరిత్ర ఎప్పుడూ భయానకమే..!!
కొలంబో/హైదరాబాద్ : శ్రీలంక.. ఓ చిన్నదేశంపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్నీ ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు 13 ఏళ్ల కిందటి నెత్తుటి చారికలను మరోసారి లంకేయుల కళ్లకు కట్టింది. శ్రీలంక పర్యటకాన్ని దెబ్బతీసేలా ఆదివారం జరిపిన ముష్కరుల దాడుల్లో 215 మందికిపైగా మృతి చెందారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఇంత భారీ ఎత్తున మృతులు, క్షతగాత్రులు ఉండటం శ్రీలంకకు కొత్తమే కాదు.
శ్రీలంక హింసాత్మకం..! భారీ సంఖ్యలోనే ప్రాణ నష్టం..!!
అక్కడ ఏ చిన్న ఘటన జరిగినా.. ప్రాణనష్టం భారీగా ఉంటుంది. 1985 నుంచి జరిగిన ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయి. 2006 వరకు ఎల్.టి.టి.ఈ ప్రభావంతో అంతర్యుద్దంతో శ్రీలంక అట్టుడికింది. ఉగ్రవాదుల దాడులు పెద్ద ఎత్తున జరిగేవి. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు టార్గెట్గా పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగేవి. 2009లో ఎల్.టి.టి.ఈని పూర్తిగా నిర్మూలించి ప్రభాకరన్ను చంపేశాక శ్రీలంకలో దాడులకు తెరపడింది.
ఏ ఘటన చూసినా అత్యంత విషాదమే..! వందల సంఖ్యలో చనిపోవాల్సిందే..!!
చివరి సారిగా శ్రీలంకలో 2006లో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత అక్కడ దాడులు జరగలేదు. 13 ఏళ్లుగా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు హాయిగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఆదివారం జరిగిన దాడితో ఒక్కసారిగా శ్రీలంక మళ్లీ భయంతో వణికిపోతోంది. గతంలో శ్రీలంకలో దాడులు పరిశీలిస్తే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
చిన్న దేశం..! పెద్ద ఉన్మాదం..!!
1)1985లో శ్రీమహా బోధి దాడిలో అనురాధాపురలో 146 మంది బౌద్ధ సన్యాసులు, ప్రజలను ఎల్.టి.టి.ఈ ఉగ్రవాదులు కాల్చి చంపారు. 2)1987లో అలుత్ క్యాగా పిలవబడే దాడిలో 127 మంది సింహళీయులను ఎల్టీటీఈ ముష్కరులు కాల్చి చంపారు. 3) అదే ఏడాది శ్రీలంక పార్లమెంటుపై ఉగ్రవాదులు గ్రేనేడ్లు విసరడంతో ఇద్దరు చనిపోయారు. 4) అదే ఏడాది కొలంబోలో బస్టాండులో కారు బాంబుపేలి 113 మంది చనిపోయారు. 5)1990లో కాట్టన్కుడిలోని మసీదులో ఎల్టీటీఈ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 147 మంది ప్రాణాలు వదిలారు.
ఎన్నో ఉదంతాలు..! అన్నీ రక్త సిక్తమే..!!
6)1992లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు పల్లుయగొడెల్లలో జరిపిన దాడిలో ఏకంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు. 7)1996లో కొలంబో సెంట్రల్ బ్యాంకు వద్ద ఎల్టీటీఈ ఉగ్రవాదులు ట్రక్కుతో పేలుడు జరపడంతో 91 మంది మృతి చెందారు. 8)2006లో దిగంపతనలో 15 మిలటరీ బస్సులను టార్గెట్ చేస్తూ ఎల్టీటీఈ ఉగ్రవాదులు జరిపిన ట్రక్కు బాంబుల దాడిలో 120 మంది సైనికులు, పౌరులు చనిపోయారు. 9) తాజాగా ఆదివారం కొలంబోలో 8చోట్ల చర్చీలు, హోటళ్లు, ఇళ్లలో జరిగిన వరుస పేలుళ్లలో 290 మందికిపైగా మృతి చెందారు.