ఉగాది: శ్రీ బాలాజీకి ముస్లింలు ప్రార్థనలు (ఫొటోలు)
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం ముస్లింలు కడపలోని పాతబస్తీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి (బాలాజీకి) పూజలు చేశారు.
పూజలు చేయడానికి ముస్లింలు బారులు తీరారు. వారిలో బుర్ఖా ధరించిన ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్దయెత్తున క్యూ కట్టారు. క్యూలో నిలుచున్న ప్రతి నలుగురిలో ఓ ముస్లిం ఉండడం విశేషం.
ఆ దేవాలయాన్ని దేవుని కడప అని ప్రజలు పిలుచుకుంటారు. దైవానికి అర్పించడానికి ముస్లింలు పుష్పాలు, బెల్లం, చెరుకు గడలలు, చింతపండు, వేప పండ్లు తెచ్చారు. మండుటెండలోనూ భక్తులు క్యూలో వేచి ఉన్నారు.
ఏటా వస్తారు...
దేవుని కడపకు ఉగాది పర్వదినం సందర్భంగా రాయలసీమ అంతటి నుంచి ముస్లింలు తరలి వస్తుంటారు. పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు.
శతాబ్దాల సంప్రదాయం
దేవుని కడపను ముస్లింలు దర్శించుకోవడం శతాబ్దాలుగా ఓ సంప్రదాయంగా వస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని వారు భక్తిప్రపత్తులతో కొలుస్తారు.
ఆహ్వానించదగ్గ పరిణామం..
దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోతోందనే విమర్సలు వస్తున్న నేపథ్యంలో దేవుని కడప మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
పెద్ద దర్గా కూడా...
కడపలో పెద్ద దర్గా కూడా ఉంది. ఆ దర్గా సందర్శన కోసం అన్ని మతాలకు చెందినవారు పెద్ద యెత్తున వస్తుంటారు.
బీబీ నాంచారమ్మ
ఉగాది నాడు ఉదయం ఆరు గంటల నుంచే ముస్లింలు బారులు తీరి శ్రీ వెంకటేశ్వర స్వామిని బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఏడాది ఎక్కువగా..
దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈసారి ఎక్కువ మంది ముస్లింలు వచ్చినట్లు చెబుతున్నారు.
ఆ తర్వాత తిరుపతికి...
భక్తులు కొంత మంది దేవుని కడప వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
ముస్లిం భక్తులకు హారతులు...
ఆలయ అర్చకులు ముస్లిం భక్తులకు హారతులు, ఇచ్చి వారిని దీవించారు. దేవుని కడప దైవాన్ని దర్శించుకున్నవారిలో ఈసారి ముస్లిం భక్తులే ముందున్నారు.