విమెన్స్ డే స్పెషల్: పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ స్థానంలో హిందూ మహిళా సెనెటర్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ పార్లమెంట్ లో శుక్రవారం అరుదైన సన్నివేశం కనిపించింది. నిజంగా అరుదైనదే. ఆ దేశ పార్లమెంట్ కు ఎన్నికైన హిందూ దళిత సెనెటర్.. పెద్దల సభకు ఒక్కరోజు ఛైర్ పర్సన్ గా వ్యవహరించారు. సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. స్పీకర్ స్థానంలో కూర్చుని ఉద్విగ్నంగా ప్రసంగించారు.
మహిళా దినోత్సవం రోజు రాహుల్ వరాలు: మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తాం
మహిళ సాధికారత గురించి ప్రసంగించారు. ముస్లిం మత ఛాందస భావాలు తీవ్రంగా ఉన్న పాకిస్తాన్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం.. పైగా పార్లమెంట్ పెద్దల సభ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పాకిస్తాన్ పెద్దల సభ ఛైర్మన్.. ఆమెకు ఈ అవకాశాన్ని కల్పించారు.
సింధ్ ప్రావిన్స్ నుంచి పార్లమెంట్ కు..
ఆ హిందూ మహిళా సెనెటర్ పేరు కృష్ణ కుమారి కోహ్లీ. కిషూ బాయి అని పిలుస్తారు. 2018లో ఆ దేశ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. సింధ్ ప్రావిన్స్ నుంచి ఆమె పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. పాకిస్తాన్ లో చెప్పుకోదగ్గ సంఖ్యలో హిందువులు నివసిస్తున్న ప్రాంతం సింధ్ ప్రావిన్స్. అక్కడి హిందువులకు ప్రతినిధిగా కృష్ణ కుమారి కోహ్లీ పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.
సింధ్ ప్రావిన్స్ లోని నగర్ పర్కర్ పట్టణం సమీపంలోని దానాగావ్ కుగ్రామంలో ఆమె 1979 ఫిబ్రవరి 1న జన్మించారు. పాకిస్తాన్ ఉమర్ కోట్ జిల్లాలో భూస్వామ్య వ్యవస్థపై, చిన్న పిల్లలను కట్టుబానిసలుగా మార్చుకున్న పెత్తందార్లపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ ప్రాంతంలోని చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చెప్పించడానికి స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. 1994లో ఆమె పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయిన తరువాత కూడా చదువును కొనసాగించారు. సింధ్ యూనివర్శిటీ నుంచి సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత రాజకీయాల్లో చేరారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో చేరారు. 2018 పాకిస్తాన్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అదే ఏడాది మారచి 12వ తేదీన సెనెటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ పార్లమెంట్ కు ఎన్నికైన రెండో సెనెటర్ గా గుర్తింపు పొందారు. రత్నా భగవాన్ దాస్ చావ్లా ఇదివరకు సెనెటర్ గా ఎన్నికయ్యారు. 2018లో బీబీసీ ప్రకటించిన వందమంది అత్యంత శక్తిమంత మహిళల్లో కృష్ణ కుమారి కోహ్లీ చోటు దక్కించుకున్నారు.
నా అదృష్టంగా భావిస్తున్నా..
పాకిస్తాన్ పెద్దల సభ ఛైర్ పర్సన్ స్థానంలో కూర్చున్న అనంతరం కృష్ణ కుమారి కోహ్లీ ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఛైర్ పర్సన్ స్థానంలో తాను కూర్చుంటానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు మరిన్ని అవకాశాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కులం, మతం, జాతి, ప్రాంతం అనే వివక్షకు అవకాశం లేకుండా పరిపాలన సాగించాల్సి ఉందని చెప్పారు. సరైన ప్రోత్సాహం ఉంటే మహిళలు శక్తిమంతులవుతారని అన్నారు.